అరికట్టేందుకు చర్యలు..
వరంగల్ అర్బన్: మహా నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. బల్దియాలో 168 మంది శాశ్వత ప్రతిపాదికన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులున్నారు. 2,873 మంది ఔట్సోర్సింగ్ కార్మికులున్నారు. కార్మికులు తమ స్థానాల్లో మరొకరిని పెట్టుకోవడం, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు సలామ్ కొడుతూ మేనేజ్ చేసుకుంటూ పూర్తిస్థాయి వేతనం పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేయాలి. వీరు రోడ్లు ఊడ్చడం, కాల్వలు తీయడం, ఇంటింటా చెత్త సేకరించడం చేయాలి. ఇందుకుగాను పర్మనెంట్ కార్మికులకు నెల వేతనం రూ.50 వేల నుంచి రూ. 80వేల వరకు బల్దియా వేతనం పొందుతున్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులు రూ.16 వేల వేతనం తీసుకుంటున్నారు. రెగ్యులర్ కార్మికులకు హాజరు పుస్తకాలతో మ్యాన్యువల్గా హాజరు వేస్తుండగా, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఫేస్ అథెంటిక్ ద్వారా వేతనాలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. విధులు నిర్వర్తించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
కార్మికులు విధులు నిర్వర్తించకుండా జవాన్లకు రూ.2 వేలు, శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.10 వేల వరకు నెలవారీగా మామూళ్లు అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోకపోవడం, అసలు ఎవరు పనిచేస్తున్నారనే విషయంపై అవగాహన కూడా లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వారి హాజరును సైతం సరిగ్గా తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. గతంలో ఇదే విషయం వెలుగులోకి రావడంతో ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు.
పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ అటెండెన్స్, మాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరైతే విధులకు వస్తారో వారి ముఖ చిత్రం ద్వారా హాజరు పడుతోంది. విధులు నిర్వర్తించాల్సిన కార్మికులు కాకుండా వేరే వారు వస్తే గుర్తిస్తాం. విధులకు డుమ్మా కొడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. – రాజేశ్, బల్దియా ఎంహెచ్ఓ


