వరంగల్ అర్బన్: బల్దియా పరిధి పలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని పౌరులు గళమెత్తారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైప్లైన్లు, అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలు, కబ్జాలపై అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనాను ప్రశ్నించారు. ఎన్నిసార్లు వినతులిచ్చినా ఇంత వరకు సమస్యలు పరిష్కారం కావట్లేదని వాపోయారు. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 111 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 58, ఇంజనీరింగ్ 36, రెవెన్యూ 6, హెల్త్, శానిటేషన్ 7, నీటి సరఫరా 2, హార్టికల్చర్ ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, అకౌంట్స్ అధికారి శివలింగం, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, సెక్రటరీ అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● 56వ డివిజన్ వడ్డేపల్లిలో 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకట్టుకుని పన్ను చెల్లిస్తున్నామని, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.
● వరంగల్ ఎల్బీ నగర్ 21వ డివిజన్లో దోబీ ఘాట్పై ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని రజక సంఘం ప్రతినిధులు ఫిర్యాదు అందించారు.
● బల్దియాలోని విభాగాల్లో సుమారు 100 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుగా ఏళ్ల తరబడి పని చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంఘం నాయకులు కోరారు.
● వరంగల్ 14వ డివిజన్ సాయినగర్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు దరఖాస్తు అందించారు.
● హనుమకొండ న్యూ రాయపుర పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
● వరంగల్ 21వ డివిజన్ ఎస్ఎస్ఎస్ అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలంలో అదనపు కట్టడాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
● వరంగల్ ఎల్బీనగర్లోని హిందూ శ్మశాన వాటికలో బర్నింగ్ ప్లాట్ ఫాం, ఇతర సమస్యలు పరిష్కారించాలని అభివృద్ధి కమిటీ కోరింది.
సమస్యలు పరిష్కరించాలని
బాధితుల వేడుకోలు
దరఖాస్తులు స్వీకరించిన
అడిషనల్ కమిషనర్ జోనా


