హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలపై పలువురు తహసీల్దార్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 282 అర్జీలు అందినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు.
సత్వరమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 191 దరఖాస్తులు వచ్చాయి. కాగా, గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు వరంగల్ గిర్మాజీపేట సర్వే నంబర్ 10లో హజ్హౌస్ నిర్మాణానికి 1800 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిందని, తిరిగి ఆ స్థలంలోనే హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు విన్నవించారు. ‘ఎస్ఐఆర్’ నమోదు ప్రక్రియ గడువును మరికొంత కాలం పొడిగించాలని కరీమాబాద్కు చెందిన ఎల్లాగౌడ్ సేవాసంస్థ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, అధికారులున్నారు.


