హన్మకొండ: ప్రయాణికుల సౌకర్యార్థం నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నూతన హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవాని ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇంటి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులకు అందుబాటు చార్జీలతో మెరుగైన సేవలు అందించేందుకు లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. ఇతర ప్రైవేట్ బస్సులకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యున్నత సౌకర్యాలతో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, లహరి బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన బాలుర ధ్రువపత్రాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డీవైఎస్ఓ స్వాగతం పలికారు. అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతి, నాణ్యమైన క్రీడా శిక్షణ, సౌకర్యాల గురించి వివరించారు. ఎంపికై న వారికి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్లు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో వారం రోజులుగా భూక్రయవిక్రయదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సర్వర్, వెబ్సైట్ మంగళవారం స్పీడ్ అందుకుంది. వరంగల్ ఆర్ఓ లో ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం 108 స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. మంగళవారం 67 స్లాట్ బుకింగ్స్ కాగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ను నిర్దేశించిన 15 నిమిషాల్లో పూర్తిచేసినట్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కరుణారెడ్డి తెలిపారు. దీంతో భూక్రయవిక్రయదారులు ఉపశమనం పొందారు.
హన్మకొండ అర్బన్: యాక్షన్ ధాన్యానికి సంబంధించిన బకాయిలు, సీఎంఆర్ ధాన్యం బకాయిలను డిఫాల్ట్ రైస్మిల్లర్లు నిర్దేశించిన గడువు (ఆగస్టు 5వ తేదీ)లోగా ప్రభుత్వానికి చెల్లించాలని సివిల్ సప్లయీస్ హెడ్ ఆఫీస్ టాస్క్ఫోర్స్ అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఎన్.రవి చాంబర్లో రైస్ మిల్లర్లు, డిఫాల్ట్ రైస్మిల్లర్లతో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, టాస్క్ఫోర్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టీచర్లకు శిక్షణ
విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు ఈనెల 8 నుంచి10 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. హిందీ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లకు హనుమకొండలోని ప్రభుత్వ డైట్, ఇంగ్లిష్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ఫిజికల్ సైన్స్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనన్నారు. హనుమకొండ జిల్లాలో సుమారు 270 మంది తరగతులకు హాజరవ్వనున్నారు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: ‘ట్రాన్స్ఫార్మేటివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్‘ అంశంపై నేటి (బుధవారం) నుంచి మూడు రోజుల సమీకృత ఉపాధ్యాయ శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మొత్తం 2,922 మంది ఉపాధ్యాయులు హాజరవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్కు జీహెచ్ఎస్ శంభునిపేటలో నిర్వహించనున్నారు.


