ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ‘కుడా’ భూముల వేలంలో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, ‘కుడా’ మాజీ చైర్మన్లు హైదరాబాద్లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్లో మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక హైదరాబాద్లో దాక్కుని ప్రెస్మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కుడా భూముల వేలం పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని, వేలంలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హనుమాన్ టెంపుల్ సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, స్టార్ హోటళ్లను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు వివరించారు. పదేళ్ల పాలనలో జరిగిన వందల అక్రమాలను ప్రజల ముందు పెట్టే ధైర్యం తమకు ఉందని, తనపై అవినీతిని ఆధారాలతో ని రూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.


