వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్రెడ్డి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ పరకాల, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందన్నారు. డిజిటలీకరణ ఈనెల 20లోపు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలీకరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతీ గురువారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వరంగల్నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, తహసీల్దారులు, తదితరులున్నారు.


