నేటి నుంచి క్రితి 3.0
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో క్రితి 3.0 (కాకతీయ రిసెర్చ్ ఇన్షియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనోవేషన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, కేఎంసీ ఎన్ఆర్ఐ సభ్యులు డాక్టర్ వేణు బత్తిని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రితిలో దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల నుంచి 1100కుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రితి 3.0లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థుల పేపర్–పోస్టర్ ప్రజెంటేషన్లు, హ్యాకథాన్, జెపార్డీ, సింపోజియం, మెడికల్ ఎగ్జిబిషన్, హ్యాండ్స్–ఆన్ సర్జికల్ వర్క్షాపులు, నిపుణుల సీఎంఈ ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ యుగేంధర్ బుధవారం తెలిపారు. ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ ఛాలెంజెస్ అండ్ లావరేజింగ్ అపార్చునిటీస్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు కీలకోపన్యాసం చేస్తారని వారు తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. అండర్–08, 10, 12, 14, 20 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 30 మంది క్రీడాకారులను ఈనెల 18న ఆదిలాబాద్లో జరిగే 11వ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పర్యటన వివరాలు విడుదల చేసింది. గురువారం ఉద యం 10 గంటలకు కాజీపేటలో ఘనస్వాగతం అనంతరం ర్యాలీగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని వేద బాంక్వెట్ హాల్కు చేరుకుని ప్రెస్మీట్లో మాట్లాడుతారు. అనంతరం ఇక్కడ జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరునుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి గుడెప్పాడ్లోని ఓ హోటల్లో బస చేస్తారు. 9న ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 10.30కు మేడారం చేరుకుని సమక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు.
నేటి నుంచి క్రితి 3.0
నేటి నుంచి క్రితి 3.0


