పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజ్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చిందు యక్షగాన కళల వైభవం కోసం పాటుపడినందుకు సన్మానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, గంటా చక్రపాణి, డైరెక్టర్ తరుణ్, ఐఐసీటీ డైరెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చెస్లో దేవాన్ష్కు అంతర్జాతీయ రేటింగ్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన బైరి దేవాన్ష్రెడ్డి చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమాఖ్య ప్రతినిధి పి. కన్నా తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్ష్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ క్లాసికల్ విభాగంలో 1508 రేటింగ్ సాధించడం హర్షణీయమన్నారు. దేవాన్ష్రెడ్డి ఆరుగురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో తలపడి విజయం సాధించారన్నారు. ఈ రేటింగ్ సాధించడంపై తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య సంతోషం వ్యక్తం చేశారు.
లోకో పైలెట్ల భర్తీకి గ్రీన్సిగ్నల్
● కాజీపేట రైల్వే అభివృద్ధిలో ఫలించిన
ఎంపీ కావ్య కృషి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే అభివృద్ధిలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలుమార్లు చేసిన విజ్ఞప్తులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ సానుకూలంగా స్పందించి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ కాజీపేట లోకో రన్నింగ్ డిపో క్రూ లింక్లు మార్చడం, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఎంపీకి లేఖ రాశారు. సోమవారం ఎంపీ కావ్య విలేకరులకు తెలిపిన వివరాలు. విజయవాడ–బల్లార్షా మధ్య 24 వందేభారత్ రైళ్లు..130 కి.మీ.వేగంతో నడుస్తున్నాయని, ఇందుకు విజయవాడ, కాజీపేట, సికింద్రాబాద్ డిపోల్లో కొన్ని క్రూ లింక్లు మార్చారని, సికింద్రాబాద్ డివిజన్లో ఖాళీల భర్తీకి 272 మంది అసిస్టెంట్ లోకోపైలెట్లు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పా రు. జూలై నాటికి శిక్షణ పూర్తి చేస్తారని, 56 మంది కొత్త వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అలాగే 1,498 మంది అసిస్టెంట్ లోకోపైలెట్ల ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని జీఎం లేఖలో పేర్కొన్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్లకు శిక్షణ పూర్తయిన తర్వాత కాజీపేట డ్రైవర్ల డిపోలో ఖాళీలు భర్తీ చేస్తామని జీఎం లేఖలో తెలియజేశారు. కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యతను కాపాడేందకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణానికి త్వరితగతిన స్థల కేటాయింపు నిర్ణయం తీసుకోవాలని రైల్వే జీఎంను కోరగా జీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. రైల్వే విస్తరణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాన విలువ గల భూమిని కేటాయించడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చూపిన భూమి విషయంలో రైల్వే అధికారులు ఆమోదం తెలిపితే త్వరితగతిన రైల్వే బస్టాండ్ పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. బస్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన రవాణా సేవలు అందుతాయని ఆమె పేర్కొన్నారు.
పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం


