జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: ప్రజల సంతృప్తే ధ్యేయంగా వారికి సేవలందించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి పెరగాలన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై సంబంధిత అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు కావాలన్నారు. జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ సక్రమంగా చేయాలని తెలిపారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తద్వారా ప్రజలు లబ్ధి పొందాలన్నారు. ప్రజలకు పథకాలు అమలైనప్పటికీ వాటిపై సంతృప్తి నూరు శాతం ఉండాలని చెప్పారు. సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, మంచి ప్రవర్తనతో మాట్లాడటం వలన సంతృప్తి స్థాయి బాగుంటుందన్నారు. ఇప్పటికీ కొందరు సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు మారడంలేదని తెలిపారు. మనమున్నది ప్రజలకు సేవ చేయడానికనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. అర్జీలు సమర్పించిన వ్యక్తులతో నేరుగా మాట్లాడి తగిన సమాచారాన్ని అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కుష్టు సర్వే విజయవంతంగా నిర్వహించాలి
జిల్లాలో కుష్టు వ్యాధి నియంత్రణకు చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు పక్కాగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. స్పష్టమైన పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ 1174 మంది ఆశా కార్యకర్తలతో పాటు ఏఎన్ఎం, పురుష సిబ్బంది సర్వేలో పాల్గొంటారని తెలిపారు. గతంలో చేపట్టిన సర్వేలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 20 కేసులు బయట పడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతుందని వివరించారు. కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ రమేష్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


