గుంటూరు రూరల్: రైతాంగం, గ్రామీణ సమాజం, వ్యవసాయాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆచార్య ఎన్.జి.రంగా అని పలువురు కొనియాడారు. ఆయన ప్రముఖ శిష్యులు రచించిన విలువైన గ్రంథాలను మరలా ముద్రించి ప్రతులను ఎన్.జి. రంగా ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణకు అందజేశారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. ఆచార్య ఎన్.జి.రంగా సుసంపన్నమైన మేధో, సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు దానిని ప్రజలకు, విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ గ్రంథ సముదాయాన్ని విశ్వవిద్యాలయానికి అప్పగించారన్నారు. ఈ అమూల్యమైన గ్రంథాలను ముద్రించి భద్రపరిచేందుకు ఎన్.జి. రంగా ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆచార్య ఎన్.జి. రంగా ఆయన శిష్యుల రచనలు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రపై విలువైన అవగాహనను కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్.జి.రంగా ఫౌండేషన్ ప్రతినిధులు కిషోర్, ప్రసాద్, మిత్ర, పుండరీకాక్షుడు, జక్కంపూడి సీతారామయ్య పాల్గొన్నారు.


