తాడికొండ: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ పనులను శనివారం మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని, స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నెల 16న అమరజీవి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయనున్నామన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమరజీవి స్మృతివనం పరిశీలించిన
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత


