భర్తతో కలిసి తల్లి ఇంటిని ఫోర్జరీ పత్రాలతో స్వాధీనం
మంగళగిరి టౌన్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికి మాయని మచ్చలా నిలుస్తున్నాయి. చివరకు కని, పెంచి ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తోంది. వృద్ధాప్యంలో కాస్తంత ఆదరవుగా ఉండి, ఆశ్రయం ఇవ్వాల్సిన కుమార్తె తన భర్తతో కలిసి ఫోర్జరీ సంతకాలతో కన్నతల్లిని మోసం చేసి ఇంటిని తనపేరిట రాయించుకుని ఆమెను ఇంటినుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం జరిగింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు. కొన్ని నెలల క్రితం చిన్న కూతురు, అల్లుడు ఆదిలక్ష్మి ఇంటికి వచ్చి, ఆమెతోపాటు ఉంటూ ఆదిలక్ష్మి ఉంటున్న ఇంటిని ఫోర్జరీ పత్రాలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. శనివారం వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడంతో మంగళగిరి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. వృద్ధురాలు ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమార్తెను, అల్లుడిని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు.


