పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో శుక్రవారం ఈ పోటీలకు ప్రచార పోస్టర్లను వాసిరెడ్డి విద్యాసాగర్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ... అండర్ 15, 13 (ఓపెన్) విభాగాలలో ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 3 వేల మంది బాల బాలికలు, 300 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. ప్రో చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పోటీలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.వి. రమణ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, వీవీఐటీయూ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


