నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం.రాజామోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
రైల్వే స్టేషన్లో గుండెపోటుతో వృద్ధుడు ..
ఈపూరు మండలం గుండే పల్లి గ్రామానికి చెందిన పాతపోతుల మల్లయ్య(85) గురువారం నరసరావుపేట రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఆరు బైక్లు స్వాధీనం
హుజూర్నగర్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపగా రిమాండ్ విధించారు. సీఐ చరమందరాజు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ మోహన్బాబు తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్ మాబు, గుంటూరు సిటీకి చెందిన షేక్ రిహాజ్గా గుర్తించారు. వారిని విచారించగా బైక్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ టౌన్తో పాటు గుంటూరులోని నగరపాలెం, పట్టాభిపురం, మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరు బైక్లు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని రిహాజ్ అమ్మమ్మ ఊరైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో దాచిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


