రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్
ఏఎన్యూ (పెదకాకాని): పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్య, పరిశ్రమల సమ్మేళనం–2026ను ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ వెల్లడించారు. ఏఎన్యూలో కమిటీ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శివరాంప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని డైక్మన్ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమ్మేళనంకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు సిలబస్ను రూపొందించడం, విద్యార్థులకు ఇంటర్నషిప్ సదుపాయం కల్పించడంతో పాటు నాలెడ్జి పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. సమ్మేళనంలో పాల్గొనేందుకు 100కు పైగా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. సమ్మేళనం కన్వీనర్ ఆచార్య పి.పద్మావతి, సంచాలకులు ఆచార్య లింగరాజు, కోశాధికారి ఆచార్య త్రిమూర్తిరావు, పరిశ్రమల ప్రతినిధి ఉమామహేశ్వరలు మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఆచార్య జ్యోతిర్మయి, పాలక మండలి సభ్యులు, సమ్మేళనం కో –కన్వీనర్లు ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్లు పాల్గొన్నారు.


