జేఈఈ మెయిన్స్కు ఇలా..
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈనెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 29న పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అయాన్ డిజిటల్ జోన్లలో ఏర్పాట్లు చేసింది. దాదాపు 15వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జేఈఈ మెయిన్స్కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్షా కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్లో ఉంచిన ఎన్టీఏ, ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది.
● జేఈఈ మెయిన్స్ అడ్మిట్కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి.
● ఉదయం పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలకు అదనంగా అరగంట సమయాన్ని కేటాయించారు.
● జేఈఈ మెయిన్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులను ధరించాలని నిబంధనలు విధించింది.
● ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజుఫోటోను అతికించాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా, పక్కన మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.
● విద్యార్థి తమ వెంట అడ్మిట్కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను వెంట తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డులను విధిగా తీసుకెళ్లాలి. ప్రతి విద్యార్థి అడ్మిట్కార్డులో పొందుపర్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ విధిగా చదవాలి.
రెండు గంటల ముందుగా కేంద్రానికి
ఈనెల 21 నుంచి 29 వరకు
వివిధ షిఫ్ట్లలో నిర్వహణ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైట్లో
అడ్మిట్ కార్డులు
ప్రతి షిఫ్ట్కు మూడు రోజుల
ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల
నీట్ తరహాలో కఠిన నిబంధనలు
అమలు చేస్తున్న ఎన్టీఏ
విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు
ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 15వేల మందికి పైగా విద్యార్థులు