నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో లవ్ యువర్ ఫాదర్ (ఎల్వైఎఫ్) చిత్ర బృందం సందడి చేసింది. వచ్చేనెల 4న ఎల్వైఎఫ్ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చిత్ర హిరో శ్రీహర్ష, నటులు బంటి, శ్రీకర్, నిర్మాత కిషోర్రాఠీ చేరుకున్నారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. అనంతరం నటుడు శ్రీహర్షను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సత్కరించి, చిత్ర బృందానికి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్ర హిరో శ్రీహర్ష మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని చెప్పారు. వచ్చే నెల 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లల్లో వీక్షించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ చిత్ర టైటిల్ లవ్ యువర్ ఫాదర్ చాలా బాగుందని అన్నారు. వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫాదర్స్ డే రోజునే కాకుండా తండ్రిని ప్రతినిత్యం ప్రేమించాలని అన్నారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ నటుడు శ్రీహర్షను అభినందించారు. టీడీపీ నాయకులు మల్లి, చిత్ర నిర్మాతలు కిషోర్ రాఠీ, రామస్వామిరెడ్డి, నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిత్ర బృందం బస్సు యాత్ర ప్రారంభించింది.