ఇటీవల ఒకరు గౌరవ తెలంగాణ హైకోర్ట్లో తెలుగులో వాదనలు వినిపించబోతే, ద్విసభ్య ధర్మాసనం తెలుగులో వాదనలు వినిపించ రాదని ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 348 (1)(ఏ) అధికరణం ప్రకారం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కార్యకలాపాలు ఆంగ్ల భాషలోనే జరగాలి. అయితే, 348(2)వ అధికరణం ప్రకారం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో హైకోర్టులో హిందీ లేదా వేరే ఇతర భాషల్లో కార్యకలాపాలు జరపవచ్చు. ఆదేశాలు, తీర్పులు మాత్రం ఆంగ్లంలోనే ఉండాలి. ఇతర భాషలో తీర్పు ఉంటే, దాని ఆంగ్లాను వాదం కూడా జత చేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు హైకోర్టులో హిందీలో కార్య కాలాపాలు నిర్వర్తించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాయి.
తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరుసగా తమిళం, గుజరాతీ, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలను తమ తమ హైకోర్టుల్లో ఉపయోగించ డానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కోరగా, 2012లో సుప్రీంకోర్టు ఆ సిఫారసులను అంగీకరించలేదు. 2016లో తమిళనాడు ప్రభుత్వం, 2012 నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ తిరిగి అదే సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు తిరిగి ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు న్యాయమూర్తులుగా నియమితులవుతారు కాబట్టి వారు ప్రాంతీయ భాషలను అర్థంచేసుకోలేరు కాబట్టి ప్రాంతీయ భాష లలో వాదనలను వినిపించవద్దనేది సుప్రీం అభిప్రాయం.
అయితే, ఇదే పరిస్థితి, పార్లమెంటులో కూడా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులుంటారు. 2025 వరకు, కేవలం, ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడటానికే అను మతి ఉండేది. కానీ, సాంకేతికతను ఉపయోగించి, 2025 నుంచి, 22 అధికార భాషలలో నుండి ఏ భాషలోనైనా పార్లమెంటు సభ్యులు మాట్లాడవచ్చు. పార్లమెంటుకు వర్తించే ఇదే సూత్రం, అదే సాంకేతి కతను ఉపయోగించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ప్రాంతీయ భాషలో వాదనలకు అనుమతించవచ్చు.
దిగువ కోర్టుల విషయానికి వస్తే, ఏ ప్రాంతీయ భాషనైనా కోర్టు భాషగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. దిగువ కోర్టుల్లో సాక్ష్యాన్ని ప్రాంతీయ భాషలోనే నమోదు చేయాలి. 1984లోనే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగులోనే దిగువ కోర్టు వ్యవహారాలను నడపా లని ఆదేశించింది. 2013లో మొదటిసారిగా అప్పటి శ్రీకాకుళం జుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నాలుగు తీర్పులను తెలుగులో వెలువరించారు. కానీ ఆ తరువాత, దిగువ కోర్టులు తెలుగులో తీర్పులను రాయడంపై శ్రద్ధ వహించడం లేదు.
అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 2017లో చేసిన సూచ నతో, చొరవతో తీర్పులు ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2019లో మొదటిసారిగా, 114 తీర్పుల ప్రాంతీయ భాషల అనువాదాలను సుప్రీంకోర్టు తమ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
ఇక హైకోర్టుల విషయానికి వస్తే, అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా 2023 ఫిబ్రవరి 21న కేరళ హైకోర్టు రెండు తీర్పులను మలయాళంలో వెలువరించింది. అదే సంవత్సరం జూన్లో తెలంగాణ ౖహె కోర్టు మొట్టమొదటిసారిగా ఓ వివాదాన్ని పరిష్కరిస్తూ తెలుగులో తీర్పు వెలువరించింది. ఇప్పుడు అన్ని తీర్పులకు తెలుగు అనువాదాలు కోర్టు వెబ్సైటులో లభిస్తున్నాయి. అయితే అవి అంతగా అర్థవంతంగా ఉండటంలేదు. న్యాయ స్థానాల్లో భాషా పండితులను నియమించడం ద్వారా అనర్థం నివా రించవచ్చు. ప్రస్తుతం, న్యాయవిద్య కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే లభ్యమవుతోంది. తెలుగులో నాణ్యమైన తీర్పులు రావాలంటే, తెలుగు భాషలో కూడా న్యాయవిద్యను ప్రవేశ పెట్టాలి. – కె.ఎస్. హరీష్ కుమార్, విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


