ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉత్తరం అంటే, ఇదేదో ప్రసిద్ధుల ప్రేమలేఖ అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే! ఇది ఒక వర్తకుడు మారిషస్ నుంచి ఫ్రాన్స్లో ఉన్న తన వ్యాపార భాగస్వాములకు రాసిన ఉత్తరం. దీనిని సింగపూర్లోని పురావస్తు సేకర్త ఒకరు సేకరించారు. బ్రిటిష్ అధీనంలోని మారిషస్ రాజధాని పోర్ట్ లూయీ నుంచి ఎడ్వర్డ్ ఫ్రాన్సిస్ అనే మద్యం వర్తకుడు 1847 అక్టోబర్ 4న ఫ్రాన్స్లో లావాదేవీలు నిర్వర్తిస్తున్న తన వ్యాపార భాగస్వాములకు రాశాడు. ఫ్రాన్స్ నుంచి నౌకలో పంపిన 48 పీపాలు అందాయని, వాటిలో తాను దాదాపు మూడోవంతు అమ్మేశానని ఈ ఉత్తరం సారాంశం.
ఈ ఉత్తరానికి అప్పట్లో అతికించిన స్టాంపుల విలువ కొన్ని పెన్నీలు మాత్రమే! ఇప్పుడు ఆ అరుదైన స్టాంపుల విలువ కొన్ని మిలియన్ల డాలర్ల మేరకు ఉండవచ్చని పురావస్తు సేకర్తల అంచనా. ఈ ఉత్తరం ఉన్న ఎన్వలప్పై అతికించిన స్టాంపుల్లో ఒకటి అత్యంత అరుదైన ‘మారిషస్ బ్లూ’ స్టాంపు. ఈ ‘మారిషస్ బ్లూ’ స్టాంపు 1993లో వేలానికి వచ్చినప్పుడు సింగపూర్ వ్యాపారి ఒకరు ఏకంగా 17 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ధర ఎంత ఉండవచ్చో ఊహించుకోవాల్సిందే!


