గోవా, హిమాచల్ప్రదేశ్ వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రతిసారీ పదే పదే వెళ్లే పర్యాటకులను మనం తరచుగా చూస్తుంటాం. ప్రపంచంలో చూడాల్సిన అందమైన ప్రదేశాలు వేలల్లో ఉండగా, ఒకే ప్రదేశానికి పదే పదే ఎందుకు వెళ్తున్నారనే సందేహం చాలామందికి రావచ్చు. అయితే మనుషులు పదే పదే ఒకే ప్రాంతాన్ని సందర్శించడం వెనుక వారి మానసిక స్థితి, భావోద్వేగాలు దాగి ఉన్నాయని టూరిజం సైకాలజీ పరిశోధనల్లో తేలింది.
స్ట్రెస్ బస్టర్..
కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రూట్లు వెతుక్కోవడం, హోటళ్లు ఎంచుకోవడం, ఆహార అలవాట్లు తెలుసుకోవడం వంటి విషయాల్లో బ్రెయిన్ స్ట్రెస్కు గురవుతుంటుంది. అదే తెలిసిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆ సమస్య ఉండదు. అప్పటికే మనకు అక్కడ ఏ కేఫ్లు బాగుంటాయో, ఏ రెస్టారెంట్లో ఆహారం నచ్చుతుందో స్పష్టత ఉంటుంది. దీనివల్ల మెదడుపై మానసిక భారం
గణనీయంగా తగ్గుతుంది.
బాండింగ్
కొన్ని ప్రాంతాలు కేవలం టూరిస్టు ప్రాంతాలుగా మాత్రమే కాకుండా, ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన హిల్ స్టేషన్లు లేదా ఈత నేర్చుకున్న సముద్ర తీరాలు వారి గుర్తింపుతో ముడిపడిపోతాయి. పరిశోధనల ప్రకారం... ఇటువంటి ప్రదేశాలు పర్యాటకులకు శారీరక, మానసిక ఉపశమనాన్ని ఇచ్చి, వారి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.
నోస్టాల్జియా..
మనం గతంలో గడిపిన క్షణాలు, అక్కడి అనుభూతులు, పరిమళాలు మనలో పాజిటివ్ థింకింగ్ని పెంపొందిస్తాయి. టూరిజం అధ్యయనాల ప్రకారం... నోస్టాల్జియా అనేది పర్యాటకులను మళ్లీ మళ్లీ పాత ప్రదేశాలకే రప్పిస్తుంది. అందుకే చాలామంది తమ చిన్ననాటి అనుభూతులను తమ పిల్లలకు లేదా మిత్రులకు పరిచయం చేసేందుకు ఆ ప్రదేశాలకు తిరిగి వెళ్తుంటారు.
సేఫ్ జర్నీ
మొదటిసారి ఒక ప్రదేశానికి వెళ్లినప్పుడు అన్ని విజిటింగ్ స్పాట్లను ఎలాగైనా చూసేయాలనే తొందరపాటు ఉంటుంది. కానీ రెండోసారి వెళ్లినప్పుడు ఆ స్ట్రెస్ పూర్తిగా తొలగిపోతుంది. ఏ విధమైన హడావుడి లేకుండా లోకల్ కేఫ్లలో సమయం గడపడం, వీధుల్లో ప్రశాంతంగా నడవటం లేదా సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం వంటివి చేయగలుగుతారు.
మనుషులు ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషించడానికి మాత్రమే ప్రయాణాలు చేయరనీ,. తమ పాత జ్ఞాపకాలను పునరుద్ధరించుకోవడానికి, తమను తాము తిరిగి ఆవిష్కరించుకోవడానికి కూడా ప్రయాణాలు చేస్తారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.


