నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు | Vitamin D Deficiency: Causes Symptoms And Health Risks | Sakshi
Sakshi News home page

Vitamin D deficiency: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు

Apr 17 2025 9:35 AM | Updated on Apr 17 2025 9:38 AM

Vitamin D Deficiency: Causes Symptoms And Health Risks

గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారన్న సామెత అచ్చం సిటీ ప్రజలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఉదయం, సాయంత్రం.. వీలైనప్పుడు ప్రతిరోజూ కాస్త సమయం శరీరానికి ఎండ తగిలితే విటమిన్‌ డి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆమాత్రం సమయం కేటాయించకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఎముకలు, కండరాలు బలహీనపడిపోవడం, లివర్, కిడ్నీ, లంగ్స్, డయాబెటిస్, బీపీ, జుట్టు నుంచి గోర్ల వరకు వివిధ రోగాలు వస్తున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) సర్వే స్పష్టం చేస్తోంది. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌నూ సరాసరి 92 శాతం మంది ప్రజల్లో విటమిన్‌ డి లోపం వేధిస్తోందని నివేదికల్లో పొందుపరిచారు. 

ఇండోర్‌ జీవన శైలితో విటమిన్‌ డి లోపం పెరుగుతోందని ఐసీఆర్‌ఐఈఆర్‌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. పిల్లలు, కౌమార దశ, గర్భిణులు, వృద్ధులపై అధిక ప్రభావం కనిపిస్తోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

2019–21లో దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరిలో విటమిన్‌ డి లోపం కనిపించగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 92 మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న యువత, విద్యార్థుల్లో సైతం విటమిన్‌ డి లోపించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా దీర్ఘకాలిక వైకల్యం సంభవించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. 

దేశంలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది పొడవునా సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయితే చాలా మంది వ్యక్తులు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ, దట్టంగా నిండిన నివాస ప్రాంతాలు, లైఫ్‌స్టైల్‌ తదితరాలు విటమిన్‌ డి లోపానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అధిక సమయం ఇల్లు, కార్యాలయాల్లో గడపటం, ఆధునిక జీవన శైలి సూర్యకాంతి ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తోందని ఐసీఆర్‌ఐఈఆర్‌ స్పష్టం చేస్తోంది. 

యువతలో ఎముకలు బలహీనపడుతున్నాయ్‌ 
నిమ్స్‌లో 2019–21 సంవత్సరాల మధ్య చేపట్టిన సర్వే, తాజాగా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో జరుగుతున్న రీసెర్చ్‌ ఫలితాలు పరిశీలిస్తే పిల్లలు, వృద్ధులు, గర్భిణులతో పాటు ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల విద్యార్థులు, యువతలో సైతం వెన్ను, నడుం నొప్పి, ఎముకలు, కండరాల బలహీనపడటం, జుట్టు రాలిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ పరిశోధనలో మొత్తం 700 మంది నివేదికలు పరిశీలించారు. అందులో యువత సుమారుగా 400 మంది ఉండగా, ఇతరులు మరో 300 మందికిపైగా ఉన్నారు. ఇంట్లో ఉన్న వారితో పోలిస్తే ఇంటి నుంచి బయటకు వచ్చే వారిలో ఈ లోపం కాస్త తక్కువగా ఉందని తేలింది. 

92 శాతం మందిపై ప్రభావం  
తెలంగాణ, హైదరాబాద్‌లో 92 శాతం మంది ప్రజల్లో విటమిన్‌ డి లోపం కనిపిస్తోంది. ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీరానికి ఎండ తగలకపోవడం, స్మోకింగ్‌ వంటివి విటమిన్‌ డి లోపానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. యువతలోనూ ఈ తరహా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కాస్త సమయం ఎండ పడితే 
విటమిన్‌ డి శరీరానికి అందుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. 
– డా.మహేశ్వర్‌ లక్కిరెడ్డి, ఎయిమ్స్‌ బీబీనగర్‌  

(చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement