హోటల్ లేదా రెస్టారెంట్ అంటే సాధారణంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా భావిస్తాం. కానీ వారణాసిలోని ముక్తి భవన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. జీవిత చరమాంకంలో ఉన్నామని భావించే కొందరు వృద్ధులు ఇక్కడికి వచ్చి, తమ చివరి రోజులను గడపాలని కోరుకుంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకమే ఈ ప్రత్యేక ప్రదేశం ఏర్పాటుకు ప్రధాన కారణం. అయితే ఇక్కడికి వచ్చిన వారికి ఒక కీలక నిబంధన ఉంది.. 15 రోజులకు మించి ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు.
కాశీ నడిబొడ్డున.. ముక్తి భవన్
ముక్తి భవన్ను కాశీ లాభ్ ముక్తి భవన్ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి గోదౌలియా ప్రాంతంలోని గిర్జా ఘర్ చౌరాహా సమీపంలోని మిశిర్ పోఖ్రా ప్రాంతంలో ఇది ఉంది. గీతా మందిర్ రోడ్డుపై, పాత నగర ప్రాంతానికి, ప్రసిద్ధ ఘాట్లకు సమీపంలో ఈ భవనం ఉంది. కాశీలోని ఆలయాలు, పురాతన వీధులు, గంగానదికి దగ్గరగా ఉండటం వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందువులు వారణాసిని భారతదేశంలోని అత్యంత పవిత్ర నగరాల్లో ఒకటిగా భావిస్తారు.
‘కాశ్యాం మరణం ముక్తి’.. అదే నమ్మకం
కాశీకి సంబంధించిన పురాతన నమ్మకాల్లో ‘కాశ్యాం మరణం ముక్తి’ అనే భావన ఒకటి. అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం కర్మ ప్రభావంతో జీవి జనన, మరణ చక్రం కొనసాగుతుంటుంది. కాశీలో మరణం ఆ చక్రం నుంచి విముక్తికి మార్గం చూపుతుందని విశ్వసిస్తారు. కాశీలో మరణించే వారికి స్వయంగా శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తాడనే మరో నమ్మకం కూడా ఉంది. అందుకే కొందరు వృద్ధులు తమ జీవితపు చరమాంకంలో వారణాసికి రావడాన్ని మరణం వైపు ప్రయాణంగా కాకుండా, ఆధ్యాత్మిక ముక్తి కోసం చేసే ప్రయాణంగా భావిస్తారు.
1958లో ప్రారంభం.. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది
ముక్తి భవన్ను 1958లో డాల్మియా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. మరణం సమీపించిందని భావించే వారు కాశీలో తమ చివరి రోజులను గడిపేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో దీని ప్రత్యేక ఉద్దేశం వారణాసిని దాటి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు ఇక్కడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 2016లో విడుదలైన హిందీ చిత్రం ‘హోటల్ సాల్వేషన్ (ముక్తి భవన్)’ ద్వారా ఈ ప్రదేశం మరింత విస్తృతంగా అందరికీ పరిచయమైంది. మరణం కోసం కుమారుడితో కలిసి వారణాసికి వచ్చే ఓ వృద్ధుడి కథాంశం ఆధారంగా ఆ సినిమా రూపొందింది.
15 రోజులే ఎందుకు?.. ఇదే అసలు నిబంధన
ముక్తి భవన్లో ఉన్న ప్రత్యేక నిబంధన ఏమిటంటే.. ఇక్కడ పరిమిత కాలం మాత్రమే బస చేసేందుకు అవకాశం ఉండటం. సాధారణంగా ఇక్కడికి వచ్చే వారికి 15 రోజుల వరకు ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలో మరణం సంభవించకపోతే, కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. బయటివారికి ఈ నిబంధన ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, సంస్థ ఉద్దేశానికి అనుగుణంగానే దీనిని అమలు చేస్తారు. ముక్తి భవన్ వృద్ధులకు దీర్ఘకాలిక వసతి కల్పించే కేంద్రం కాదు. జీవిత చివరి దశలో ఉన్నామని భావించే వారికి చివరి రోజులను గడిపే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం.
ప్రార్థనలు, భజనల మధ్య సహజ మరణం
ముక్తి భవన్ సాధారణ అతిథి గృహంలా ఉండదు. ఇక్కడి వాతావరణం ప్రార్థనలు, భక్తి గీతాలు, మతపరమైన పారాయణలు, ఆచారాలతో కూడి ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ ఆప్తులతో కలిసి ఉంటారు. అయితే ఇక్కడ మరణాన్ని వేగవంతం చేసే ఎలాంటి ప్రయత్నాలు జరగవు. సహజంగానే మరణించే వరకు వేచి ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడినా లేదా 15 రోజుల గడువు దాటినా అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ముక్తి భవన్కు వచ్చే వారికి ఈ ప్రయాణం మరణం నుంచి తప్పించుకోవడం కోసం కాదు.. తమ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం జీవిత చరమాంకాన్ని స్వీకరించేందుకు చేసే ప్రయాణంగా భావిస్తారు. వృద్ధాప్యం, మరణాన్ని వీలైనంత ఆలస్యం చేసేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న సమయంలో, వారణాసి వీధుల్లోని ఈ చిన్న భవనం జీవితం, మరణం, మోక్షం గురించి మరో భిన్నమైన దృక్కోణాన్ని చూపిస్తుంది.
ఇది కూడా చదవండి: నీమ్ కరోలి బాబా ఎవరు.. స్టీవ్ జాబ్స్ను ఎలా ప్రభావితం చేశారు?


