
పూర్ణాలు..
కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.
పరమాన్నం..
కావలసినవి: బియ్యం – అర కప్పు,
పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు,
నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు.
తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి.
స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.
మామిడికాయ పులిహోర
కావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ.
(చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు)