జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.
పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు.
వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


