
సిటీ వ్యాపార తెరపై బాలీవుడ్ నటీనటుల రంగ ప్రవేశం ఇప్పటికే ఊపందుకుంది. అదే బాటలో మరోవైపు క్రీడాకారులు, మరీ ముఖ్యంగా క్రికెట్ వీరులు భాగ్యనగర పిచ్పై అడుగుపెట్టడం మొదలైంది. జాతీయ స్థాయిలో వినోద, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఇతర రంగాలపై సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారి వ్యాపార రంగానికి నగరం ఒక తిరుగులేని గమ్యంగా కనిపిస్తోంది.
వరుసగా ఇక్కడ రెస్టారెంట్స్ ప్రారంభిస్తున్న వైనం
వైవిధ్యభరిత కేఫ్ల నుంచి విలాసవంతమైన ఫైన్–డైన్ స్పాట్ల వరకూ కాదే వ్యాపారమూ కాలుపెట్టేందుకు అనర్హము అన్నట్టుగా సెలబ్రిటీలు నగరంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పటికే విభిన్న దేశాల, వైవిధ్యభరిత రుచులతో ఆహార ప్రియులకు వెల్కమ్ చెబుతున్న నగరం పలువురు సెలబ్రిటీల కొత్త రూట్కు బాటలు వేస్తోంది.
మిగిలిన మెట్రోలతో పోలిస్తే వేగవంతమైన వృద్ధితో, విస్తృతమైన వ్యాపార అవకాశాలతో స్వాగతం పలుకుతోంది హైదరాబాద్. ఈ నేపథ్యంలో నగరంలో ఆహార విపణి రంగంలో కాలు మోపిన క్రికెటర్లు, వారు నెలకొల్పిన రెస్టారెంట్ల విశేషాలు ఇవీ..
పేసర్..ఫ్లేవర్..
క్రికెట్ ప్రేమికులకు చిరపరిచితమైన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నగరం వైపు తన బౌలింగ్ను గురిపెట్టాడు. ఆయన హైదరాబాద్లో తన సొంత విలాసవంతమైన రెస్టారెంట్, జోహార్ఫాను ఏర్పాటు చేశాడు.
ఈ వారంలో ఇది ప్రారంభం కాబోతున్న ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఆయన నెలకొల్పారు. జోహార్ఫా.. మొఘల్, పెర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాల మిశ్రమంతో నగరవాసులకు రాచరికపు కుకింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇస్తున్నారు.
గ్రాండ్’ ఎంట్రీ..
అంతర్జాతీయంగా పేరొందిన చదరంగం క్రీడాకారుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ సైతం నగరంలో క్రీడాకారుల రాకకు తన వంతు ఊపు తెచ్చారు. యోగా, వెల్నెస్ నిపుణుడు కూడా అయిన అంకిత్.. గత మార్చి నెలలో జూబ్లీహిల్స్లో ఒక వినూత్నమైన ఆరోగ్య సాధనా కేంద్రాన్ని ‘అంకితం’ పేరిట ఏర్పాటు చేశారు.
పైలేట్స్, యోగా, ధ్యానంతో పాటు జిమ్ వర్కవుట్స్ సైతం అందుబాటులోకి తెస్తూ పూర్తి స్థాయి వ్యాయామాలకు, వెల్నెస్ యాక్టివిటీలకు అంకితం అయిన వెల్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు.
రుచుల.. బ్యారక్స్..
గత ఏడాది డిసెంబర్లో సైనిక్పురిలో బ్యారక్స్ – ఆంటెరూమ్ను ప్రారంభించడం ద్వారా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా నగర ఆహార రంగంలోకి ప్రవేశించారు. మూడు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ప్రదేశం కేవలం రెస్టారెంట్.. అంత కంటే ఎక్కువ. ఇది పూర్తి స్థాయి సోషల్ గేదరింగ్ అని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఈ జాబితాలో కొత్తగా సిరాజ్ జోహార్ఫా చేరడంతో.. మరింత మంది క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు ఈ పంథాను అనుసరిస్తారని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. క్రీడల్లో అద్భుతమైన విజయాలతో నగరవాసులకు దగ్గరైన క్రీడాకారులు తమ వంటకాల్లో వైవిధ్యం ద్వారా కూడా తమను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
రన్మెషిన్.. వన్ 8తో వచ్చెన్..
భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ తన ప్రసిద్ధ వన్8 కమ్యూన్ రెస్టారెంట్ను గత ఏడాది మేలో నగరంలో ప్రారంభించారు. అనతి కాలంలోనే నగరంలో అత్యంత ట్రెండీగా, లగ్జోరియస్గా మారింది. నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్ దాని ప్రీమియం వైబ్ ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్లో గత జనవరి నెలలో ఓ గెస్ట్కి స్వీట్ కార్న్ తీసుకున్నందుకు గాను రూ.525 బిల్ వేయడం అనే ఉదంతం వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్గా మారింది.
(చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..)