
వేలాది ఎకరాల ఎడారిని పచ్చని పంటలఒయాసిస్సులుగా తీర్చిదిద్దిన ఘనత
బయోడైనమిక్ / సేంద్రియసేద్యంపైరైతులకు శిక్షణ
ఈజిప్టుఎడారులను పచ్చని పొలాలుగామార్చుతున్న సెకెమ్ సంస్థ
సెకెమ్ను వరించిన అనేక అంతర్జాతీయ పురస్కారాలు
‘సెకెమ్’ కథ తెలుసుకోవటం అంటే.. ఎడారిలో ఒయాసిస్సు వంటి పచ్చని సేంద్రియ పంట పొలాలను సృష్టించటం ద్వారా జీవితేచ్ఛకు కొత్త ఊపిర్లూదటమే. ఈజిప్టులో బయోడైనమిక్ అనే ఓ రకం సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా ఇసుక రేణువులకు తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ ‘సెకెమ్’. సెకెమ్ అంటే స్థానిక భాషలో ‘సూర్యుని తేజస్సు‘ అని అర్థం. ఇది 47 ఏళ్ల క్రితం ఏర్పడింది. రసాయనిక వ్యవసాయం వల్ల ఏటేటా పంట భూములు పూర్థిస్థాయి ఎడారి ఇసుక దిబ్బలుగా నిర్జీవమవుతూ ఆ నేలలో ఆహారోత్పత్తి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చుతున్న సంక్షోభ దశలో సెకెమ్ పుట్టింది.
తాను సేంద్రియ సాగు చేస్తూ రైతులకు నేర్పిస్తోంది. వారు పండించిన పంటను రూపం మార్చి విక్రయిస్తూ విలువలతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తి, సరఫరా వ్యవస్థలకు చిరునామాగా మారింది. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఎడారిగా మారిన భూమిని బయోడైనమిక్ వ్యవసాయం ద్వారా పునరుజ్జీవింపజేస్తోంది. ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేలతల్లికి ప్రణమిల్లి గుణాత్మకమైన మార్పు తెస్తున్న సెకెమ్ కృషి గురించి తెలుసుకోవటానికి మించిన స్ఫూర్తిదాయకమైన కథ, రైతులకే కాదుసమాజంలో ప్రతి ఒక్కరికీ, మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు!
సెకెమ్ కథ ఈజిప్టు ఎడారిలో ఒక టెంట్, ట్రాక్టర్, పియానోతో ప్రారంభమవుతుంది. 1977లో ఇబ్రహీం అబౌలీష్ ఈ సామాజిక స్పృహ ఉన్న సంస్థను ప్రారంభించారు. 20 సంవత్సరాలు విదేశాల్లో రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్ర రంగంలో పనిచేసిన తర్వాత ఆయన ఈజిప్ట్కు తిరిగి వచ్చారు. ఆ సమయంలో, ఈజిప్ట్ సంక్షోభ స్థితిలో ఎదుర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాకు మరింత ఆహారోత్పత్తి చేయాల్సిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కునారిల్లుతోంది.
వ్యవసాయ భూములు ఎడారిగా మారిపోతున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వినియోగం నేలలను విషపూరితం చేసింది. కాబట్టి, రాజధాని కైరోకు ఈశాన్యంగా ఉన్న ఎడారి ప్రాంతంలో అబౌలీష్ ఒక టెంట్లో సెకెమ్ను స్థాపించారు. ప్రకృతి, మానవ అభివృద్ధి, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యాన్ని నొక్కి చెబుతూ.. సేంద్రియ వ్యవసాయం ద్వారా దాన్ని సాధించాలని సెకెమ్ బలంగా నమ్మింది.
బయోడైనమిక్ సేద్యం దిశగా 40 వేల మంది రైతులు
అబౌలీష్ మొదటి రెండు పెట్టుబడులు ట్రాక్టర్, పియానో! 2017లో ఇబ్రహీం అబౌలీష్ మరణించిన తర్వాత అతని కుమారుడు హెల్మీయే సంస్థను నడిపిస్తున్నారు. మానవాళిని ప్రకృతితో తిరిగి అనుసంధానించడంలో ‘భావోద్వేగాలు, భావాల’ ప్రాముఖ్యతకు పియానో ఓ ప్రతీక అంటారు సెకెమ్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న హెల్మీ. స్థాపితమైన 47 సంవత్సరాల తర్వాత సెకెమ్ ఒక బహుముఖ అభివృద్ధి సంస్థగా వికసించింది. ఇది ఎడారీకరణను ఎదుర్కోవడానికి, స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించడానికి, గ్రామీణ పేదరికాన్ని పరిష్కరించడానికి, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయ పడుతోందని యుఎన్ఇపి ప్రశంసించింది. 15,000 మంది రైతులు 19,000 హెక్టార్ల వ్యవసాయ భూములను 2022 నాటికే బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చడానికి తోడ్పడింది.
ఈజిప్షియన్ బయోడైనమిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో 2025 చివరి నాటికి 40,000 మంది రైతులు బయోడైనమిక్ వ్యవసాయంలోకి మారడానికి సహాయం చేయాలని సెకెమ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి 2,50,000 మంది రైతులకు చెందిన 16 లక్షల ఎకరాలను బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చే దిశగా కృషి చేస్తోంది.
అంతేకాదు, 1,000 హెక్టార్ల ఎడారిని తీసుకొని, అందులో ఆహార స్వయం సమృద్ధిగల సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో సెకెమ్ ఉంది. ఈజిప్ట్ భూమిలో 96 శాతం ఎడారిగా ఉంది. అందుకే ఎడారిని తిరిగి పచ్చని పంట భూమిగా మార్చే ఈ కార్యక్రమానికి ‘గ్రీనింగ్ ది డెజర్ట్’ అని పేరు పెట్టింది. వాతావరణాన్ని అతిగా వేడెక్కిస్తున్న కర్బనాన్ని గాలిలో నుంచి భూమిలో స్థిరీకరింపజేయటం ద్వారా పది వేల మంది ప్రజలకు రసాయన రహిత ఆహారం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
గుడారం నుంచి విశ్వవిద్యాలయం వరకు...
ఎడారిలో ఒక గుడారంలో ప్రారంభమైన సెకెమ్ ప్రయాణం ప్రముఖ అభివృద్ధి సంస్థగా పురోభివృద్ధి సాధించింది. పాఠశాలలు, శిక్షణా కేంద్రాలతోపాటు ఏకంగా సొంతంగా ఓ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. ఎడారీకరణను, భూముల రసాయనీకరణను ఎదుర్కోవడానికి రైతులను, యువతను శిక్షణతో, మార్గదర్శకత్వంతో సమాయత్తం చేస్తోంది.
సెకెమ్ సేంద్రియ ఉత్పత్తులకు ‘ఎకానమీ ఆఫ్ లవ్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను నెలకొల్పింది. ఈ ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తుంది. యూరోపియన్ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో ఈజిప్టులో బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతి విస్తరణకు అవసరమైన నిధులను సేకరిస్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయంతో పాటు సహజ ఔషధాలు, వస్త్రాలు, ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని వ్యాపింపజేయటం కోసం సెకెమ్ ప్రత్యేక సంస్థలను నెలకొల్పటం విశేషం.
2017లో ఇబ్రహీం అబౌలీష్ మరణించిన తర్వాత సంస్థ సారధ్యబాధ్యతలు చేపట్టిన హెల్మీ అబౌలీష్ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. 2057 నాటికి ఈజిప్ట్లోని 70 లక్షల రైతుల పొలాలను బయోడైనమిక్ వ్యవసాయంలోకి మార్చాలన్నది అందులో ముఖ్యమైనది.
పురస్కారాల వరద
వజ్రసంకల్పంతో ఇసుకలో పచ్చని పంటలు పెంచుతున్న సెకెమ్కు అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ప్రతిష్టాత్మక అవార్డులెన్నో వచ్చాయి. గతంలోనే రైట్ లైవ్లీహుడ్ అవార్డు వచ్చింది. 2024లో గుల్బెంకియన్ హ్యుమానిటీ పురస్కారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేస్తున్న రైతు సాధికార సంస్థతో కలసి సెకెమ్ ఈ పురస్కారాన్ని పంచుకోవటం విశేషం. ఐక్యరాజ్యసమితికి చెందిన పర్యావరణ విభాగం (యుఎన్ఇపి) ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్–2024’ ఇటీవల లభించింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల టన్నుల ఆహారా ధాన్యాలను ఉత్పత్తి చేయగల 1.2 కోట్ల హెక్టార్ల భూమి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు, ఎడారీకరణ కారణంగా నష్టపోతున్నట్లు యుఎన్ఇపి తెలిపింది. నిస్సారమైన భూములను, ఎడారులను సేంద్రియ పర్యావరణ వ్యవస్థలుగా పునరుజ్జీవింప చేయడానికి సెకెమ్ పాటుపడుతున్నదని ఈ సంస్థ పేర్కొంది.
ఎడారిలో జీవాన్ని సృష్టిస్తున్నాం.. ‘మిషన్ ఇంపాసిబుల్’నే ఇష్టపడతాం!
‘ఈజిప్ట్ భూమిలో 96 శాతం ఎడారి. 50 ఏళ్ల క్రితం తలసరి సాగు భూమి విస్తీర్ణం 600 క్యూబిక్ మీటర్లు ఉండేది. ఇప్పుడది 300 క్యూటిక్ మీటర్లకు తగ్గి΄ోయింది. ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని సమూలంగా మార్చగలమని నిరూపించాలని మా నాన్న సంకల్పించారు. ప్రేమతో కూడిన ఆర్థిక వ్యవస్థ’ను నిర్మించాలని మా నాన్న కలగన్నారు. ఇది శూన్యమైన ఎడారిలో జీవాన్ని సృష్టించటం లాంటిదే. అత్యంత అరుదైన నీటిని పొదుపుగా వాడుతున్నాం. కం΄ోస్టు సహాయంతో ఇసుకలో పంటలు పండిస్తున్నాం. సోలార్ విద్యుత్తును వాడుతున్నాం. ఎడారిని ఆకుపచ్చగా మార్చుతున్నాం. కార్బన్ క్రెడిట్స్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాం. 2057 నాటికి దేశంలో 70 లక్షల మంది రైతులను బయోడైనమిక్ సేద్యంలోకి మార్చాలన్నది లక్ష్యం. మేం ఈ మైలురాయిని చేరుకోకపోతే మా పరమ లక్ష్యం నెరవేరదు. ఇది అసాధ్యమని చాలా మంది అన్నారు. కానీ, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయటంలో మేం నిపుణులం. మిషన్ ఇంపాసిబుల్నే మేం ఇష్టపడతాం..’
– హెల్మీ అబౌలీష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెకెమ్, ఈజిప్టు
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్