ఆకాశమే హద్దుగా స్కై ఫార్మింగ్‌! | Kerala Woman farmer Rathnam inspirational story | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దుగా స్కై ఫార్మింగ్‌!

Jul 28 2026 6:17 AM | Updated on Jul 28 2026 6:17 AM

Kerala Woman farmer Rathnam inspirational story

అడవి పందుల వేధింపులకు చెక్‌

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు

కొబ్బరి ఆకుల కుండీలతో నిలువు వ్యవసాయం చేస్తున్న కేరళ రైతు రత్నం

ఇంటి/మిద్దె పంటల సాగుదారులు, చిన్న కమతాల రైతులకు ఆదర్శం

తక్కువ భూమి, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, ముఖ్యంగా అడవి పందుల దాడులు... చిన్న, సన్నకారు రైతులను నిరంతరం వేధించే ప్రధాన సమస్యల్లో ఇవి కొన్ని. వీటన్నింటికీ ఒకే ఒక్క సృజనాత్మక పరిష్కారం చూపారు రత్నం అనే మహిళా రైతు. 

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా ముల్లాస్సేరికి చెందిన ఆమె క్యాన్సర్‌ మహమ్మారినే కాదు సాగులో సవాళ్లనూ జయించారు. అడవిపందులు తదితర వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘స్కై ఫార్మింగ్‌‘ విధానాన్ని రూపొందించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల దృష్టిని ఆమె కృషి ఆకర్షించింది. నేడు చిన్న రైతులకు, ఇంటిపంటలు, పెరటి/మిద్దె తోటలు పెంచే వారికి గొప్ప వరంగా మారింది.

కొబ్బరి ఆకులతో కుండీలు
రత్నం ప్లాస్టిక్‌ గ్రో బ్యాగ్‌లకు స్వస్తి చెప్పి పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోయే పర్యావరణహిత కుండీలను తయారు చేశారు. స్థానికంగా విరివిగా దొరికే కొబ్బరి ఆకులతో కుండీలను అల్లారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ కుండీలకు లోపలి వైపు నాన్‌–వోవెన్‌ ఫ్యాబ్రిక్‌ను పరచి, దృఢత్వం కోసం స్వల్పంగా సిమెంట్‌తో లేపనం చేస్తారు. ఈ కుండీలు దాదాపు 5 సంవత్సరాల కాలం మన్నికగా ఉంటాయని ఆమె నిరూపించారు. సాధారణంగా 2–3 గ్రో బ్యాగ్‌లు పెట్టే చిన్న స్థలంలో కొబ్బరి ఆకుల కుండీలను నిలువుగా దృఢమైన స్తంభాలకు వేలాడదీయటం ద్వారా ఏకంగా 12 కుండీలను అమర్చవచ్చని రత్నం చెప్పారు.

అడవి పందుల నుంచి రక్షణ 
నేలపైన కొన్ని అడుగుల ఎత్తులో వేలాడే కుండీల్లో పంటలు పండిస్తున్నారు. దీని వల్ల అడవి పందులు, ఇతర జంతువుల దాడి నుంచి పంటకు 100% రక్షణ లభిస్తోంది. అంతేకాదు, నేల ద్వారా వ్యాపించే అనేక తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధులు రాకుండా పంటలు సురక్షితంగా పెరుగుతున్నాయి. 

రత్నం అభివృద్ధి చేసిన వినూత్న సాగు పద్ధతిలో సొంత ఆర్గానిక్‌ కంపోస్టు వాడతారు. కోళ్ల పెంట, మేకల ఎరువు, కొబ్బరి పొట్టు, ఎండిన/పచ్చి ఆకులు, ఆవు మూత్రంతో ఇంట్లోనే 45 రోజుల్లో అత్యంత పోషకాలతో కూడిన కంపోస్ట్‌ తయారు చేస్తారు. 

ఈ కంపోస్టును కుండీల్లో నింపి, అందులో ఆకుకూరలు, బెండ, వంగ, మిరప, సొర వంటి కూరగాయలతో పాటు కంద, ఔషధ గుణాలున్న అరుదైన బూడిద గుమ్మడి వంటి పంటలను రత్నం సాగు చేస్తున్నారు. వివిధ రకాల పంటలను ఏడాదంతా సాగు చేస్తున్నారు. నిరంతరం దిగుబడి పొందుతూ అదనపు ఆదాయంతో పాటు కుటుంబ పోషకాహార భద్రతను సాధిస్తున్నారు.            

రైతులకు మార్గదర్శనం
రత్నం కేవలం తన పనులకే పరిమితం కాకుండా, ఊళ్లోని ఇతర రైతులకు, పెరటి/మిద్దె తోటల పెంపకం దారులకు తోడ్పాటునందిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, నారు అందిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థలా భావం ఉన్న పట్టణ పరిసర ప్రాంత రైతులకు, టెర్రస్‌ గార్డెన్‌ ప్రియులకు, చిన్న రైతులకు ఆమె ఆవిష్కరించిన ‘స్కై ఫార్మింగ్‌’ ఒక విప్లవాత్మకమైన మార్గదర్శిగా మారిందని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. కేపీ స్మిత ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement