కోరికల పరుగు | Spiritual Progress through the Power of Desire | Sakshi
Sakshi News home page

కోరికల పరుగు

Jun 22 2026 12:55 AM | Updated on Jun 22 2026 12:55 AM

Spiritual Progress through the Power of Desire

మంచిమాట

ఈ అనంత విశ్వంలో మానవ జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణానికి ఇంధనం, వేగం, దిశ అన్నీ ఇచ్చేది ఒక్కటే ‘కోరిక’. పుట్టుకతో మొదలైన ఈ కోరికల పరుగు, మనిషి చివరి శ్వాస విడిచే వరకు సాగుతూనే ఉంటుంది. నది సముద్రంలో కలవాలని పరిగెత్తినట్లు, మనిషి కోరికల వెనుక పరిగెడుతుంటాడు. కానీ నదికి గమ్యం దొరుకుతుంది, మనిషి కోరికల పరుగుకు గమ్యం దొరకడం లేదు.  ఆధ్యాత్మిక కోణంలో ఈ ‘కోరికల పరుగు’ వెనుక ఉన్న రహస్యాన్ని, దాని ప్రమాదాలను, దాన్ని అధిగమించే మార్గాన్ని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన నిజాలు కనిపిస్తాయి. 

హిందూ తత్వశాస్త్రంలో కోరికను ‘తృష్ణ’ అంటారు. తృష్ణ అంటే కేవలం దాహం కాదు, ఎంత తాగినా తీరని విచిత్రమైన దాహం. ఒక కోరిక నెరవేరగానే, ఆ సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది. ఆ స్థానంలో మరో కొత్తకోరిక మొలకెత్తుతుంది. సైకిల్‌ ఉన్నవాడు బైక్‌ కావాలంటాడు, బైక్‌ ఉన్నవాడు కారు కావాలంటాడు, కారు ఉన్నవాడు విమానం కావాలంటాడు. ఈ పరుగు వస్తువుల దగ్గరే ఆగిపోదు; కీర్తి, అధికారం, పదవుల వైపు విస్తరిస్తుంది. 

ఈ పరుగులో మనిషి ’వర్తమానాన్ని’ (జీవితాన్ని) పూర్తిగా కోల్పోతున్నాడు. మన జీవితాల్లో కూడా ‘ఈ ఒక్క కోరిక తీరితే నేను ప్రశాంతంగా ఉంటాను’ అని అనుకుంటాం. కానీ ఆ కోరిక తీరిన తర్వాత కూడా ప్రశాంతత దొరకదు. సుఖం అనేది వస్తువుల్లో లేదు, మన అంతరంగంలో ఉందనే సత్యాన్ని గ్రహించకుండా బాహ్య ప్రపంచంలో వెతకడమే ఈ మృగతృష్ణ.

 ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తే మనస్సును – సేవ, కరుణ, భక్తి, ఆత్మవిచారణ వైపు మళ్ళించడం. నది ప్రవాహాన్ని మళ్ళించి పంటలు పండించినట్లు, కోరికల శక్తిని ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకోవచ్చు.

కోరికల పరుగులో అలసిపోవడం కాదు, ఆ పరుగును ఆపి ‘నేను ఎటు పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నాను?’ అని ఒక్క క్షణం ఆగి ఆలోచించడమే వివేకం. పరుగు ఆగిన చోటే ప్రశాంతత మొదలవుతుంది. ఆ ప్రశాంతతే పరమాత్మ స్థితి. మనస్సు అనే అశ్వాన్ని కోరికల వైపు కాకుండా, అంతిమ సత్యం వైపు నడిపించినప్పుడే ఈ జీవన ప్రయాణానికి సార్థకత లభిస్తుంది.

కోరికలు ఉండటం సహజం, కానీ కోరికలే మనల్ని నడపడం ప్రమాదకరం. ఈ పరుగును అదుపు చేయడానికి ఆధ్యాత్మికత కొన్ని మార్గాలను చూపుతోంది.‘నాకు ఏది లభించిందో అది భగవత్‌ ప్రసాదం’ అనే భావన అలవడినప్పుడు పరుగు వేగం తగ్గుతుంది. కోరిక పుట్టినప్పుడు దాంతో పాటు పరిగెత్తకుండా, ‘నా మనస్సులో ఈ కోరిక పుట్టింది‘ అని ఒక మూడోవ్యక్తిలా గమనించడం ఒక్కటే పరిష్కారం.

శ్రీ శంకరాచార్యులు భజగోవింద శ్లోకాల్లో కోరికల తీవ్రతను హెచ్చరించారు. అగ్నిలో నెయ్యి పోస్తే అగ్ని చల్లారదు, ఇంకా ఎక్కువ రగులుకుంటుంది. అలాగే, కోరికలను తీర్చుకుంటూ పోతే అవి శాంతించవు, మరింత బలీయంగా తయారవుతాయి. శరీరం ముసలిదైపోయినా, పళ్ళు రాలిపోయినా, చేతికి కర్ర వచ్చినా... మనస్సులో ఉన్న ఆశ/కోరిక మాత్రం ముసలిది కాదు, అది పరిగెడుతూనే ఉంటుంది.

– తరిగొప్పుల వీఎల్లెన్‌ మూర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement