
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేర్యాల నకాషి పెయింటింగ్స్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు ఆదరణ లేని ఈ చిత్రాలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో గ్రామీణ, సాంస్కృతిక ఇతివృత్తాలను తెలిపే చిత్రాలను వేస్తోంది బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్కు చెందిన ధనాలకోట వైకుంఠం నకాషి కుటుంబం. మహాభారతం, రామాయణం, వివిధ భారతీయ పురాణాలు వంటి హిందూ ఇతిహాసాలను చిత్రాల రూపంలో ఆలయాలు, మ్యూజియాల్లో, పలు ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ తరహా చిత్రకళపై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు.
నకాషి కళాకారులు 13వ శతాబ్దం నుంచి చిత్రకళను ప్రారంభించారు. రాజులు, జమీందారులు తమ ఇళ్లలో ఇంటీరియల్ డిజైన్ కోసం, వాహనాల రూపంలో ఈ తరహా పెయింటింగ్స్ చెక్కలతో చేయించుకునేవారు. అంతేకాకుండా గ్రామ దేవతల విగ్రహాలు, బొమ్మల కొలువులు, ఆవుపేడ, చింతపిక్కలతో చిన్న పిల్లలకు బొమ్మలు చేసేవారు.
వందల సంవత్సరాల క్రితమే కథ చెప్పే సంఘాలు వీటిని దృశ్య సహాయంగా ఉపయోగించుకుని కథలు చెప్పుకుంటూ తెలంగాణ గ్రామాల్లో తిరిగేవారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అనేది ఆడియో – విజువల్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభ రూపాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ రాష్ట్రంలో నకాషి కులస్తులు మాత్రమే వీటిని తయారు చేస్తారు. ఎనిమిది కులాల పురాణాల చిత్రాలను వీరే వేస్తారు.
దేశంలో పలు ఆలయాలు, మ్యూజియాల్లో చేర్యాల నకాషి చిత్రాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఉజ్జయినిలో శివపురాణం, దీనిని ఇటీవల ప్రధాని మోదీ సందర్శించారు. శివపురాణం ఆయనను ఆకట్టుకోగా, పెయింటింగ్స్ వివరాలు తెలుసుకుని గీసిన వైకుంఠం నకాషి గురించి మన్కీ బాత్లో మాట్లాడారు.
నూతన పార్లమెంట్ భవనంలో జైన్ మహావీర్ చరిత్ర ఏర్పాటు చేశారు. బొల్లారం రాష్ట్రపతి భవన్లో ఈ తరహా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. బీహారులోని తక్షశిల మ్యూజియంలో, అయోధ్యలోని తులసీదాస్ రామాలయం మ్యూజియంలో, భోపాల్లోని ఆదివాసీ లోక్ కళా చిత్రసమితి ప్రదర్శనలో ఉంచారు. స్విట్జర్లాండ్, చైనా, లండన్, మలేషియా, ఇటలీ, బెర్లిన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శనలో పెట్టారు. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ చేర్యాల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.
నకాషి కళకు ప్రభుత్వాల సహకారం..
చేర్యాల నకాషి పెయింటింగ్స్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. వైకుంఠం నకాషి కుటుంబ సభ్యులు వనజ, రాకేష్ నిహారిక, వినయ్కుమార్, తన్మయ్, సారిక ఈ చేర్యాల చిత్రాలను వేస్తున్నారు. వైకుంఠానికి 2016లో జాతీయ అవార్డు, 1994, 1995లో నేషనల్ మెరిట్ అవార్డు, 1994లో రాష్ట్ర అవార్డు లభించాయి.