లీగలాటా
‘నాఇల్లు– నా కుక్కలు– నా ఇష్టం’ అనే వాదన చెల్లుతుందా?
‘ఒకరు ముద్దు... ఇద్దరు హద్దు... ముగ్గురు అసలే వద్దు...’ కుటుంబ నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వాలు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు జనాభా విషయంలో ప్రభుత్వాల వైఖరి మారినా, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు పెద్దలు. అది పిల్లలకైనా, పెంపుడు జంతువులకైనా వర్తిస్తుంది. ఏదైనా పరిమితంగా ఉంటేనే మేలు. లేదంటే అనేక చిక్కులు... ఒక్కోసారి కోర్టు కేసులు ఎదుర్కొవాల్సి రావచ్చు.
కోయంబత్తూరులోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి ఇంట్లోని కుక్కల వల్ల తమకు ఇబ్బందవుతోందని, దుర్వాసన వస్తోందని కాలనీ వాసులు అధికారికి ఫిర్యాదు చేశారు. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది.
ఇంట్లో కుక్కలు పెంచుకోవడం సర్వసాధారణం. అయితే ఒకటో రెండో కుక్కలు ఉంటే ప్రేమ; ఐదారు ఉంటే అభిరుచి. ఏకంగా రెండు డజన్లకు పైగా ఉంటే; అవి ఒకేసారి అరుస్తుంటే; వాటి దుర్వాసస చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపిస్తుంటే; కాలనీ వాసులకు వాటి అరుపులతో పగలు ప్రశాంతత, రాత్రి పూట నిద్ర కరువైతే... ఏమౌతుంది. చుట్టుపక్కల వారికి చిరాకొస్తుంది. కోపం తెస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిర్రెత్తుకొచ్చి వారంతా అధికారికి ఫిర్యాదు చేశారు. మొదట ఇది సాధారణ ఫిర్యాదులా కనిపించినా, మన ఇల్లు... మన ఇంట్లో కార్యకలాపాలకు ఉన్న పరిమితి ఏంటి? ‘నాఇల్లు– నా కుక్కలు– నా ఇష్టం’ అనే వాదన చెల్లుతుందా? వ్యక్తిగత అభిరుచి, స్వేచ్ఛ ముఖ్యమా? పొరుగువారి ప్రశాంత జీవనం, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలా? వంటి కీలకాంశాలను కోర్టు చర్చించింది. చట్టంలో పేర్కొన్న పలు అంశాలు సందర్భానుసారం ఎలా వర్తిస్తాయో వివరిస్తూ ఆసక్తికర తీర్పును వెలువరించింది.
కేసు పూర్వాపరాలు
కోయంబత్తూరులోని సర్క్యూట్ హౌస్రోడ్డులో విక్రమ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను వివిధ జాతులకు చెందిన 30 కుక్కలను పెంచుతున్నాడు. ముఖ్యంగా రాత్రి పూట అవి మొరగడంతో ప్రశాంతత కరువై, నిద్ర పట్టడం లేదని, దుర్వాసన వల్ల పరసర ప్రాంతాల్లో అనారోగ్యకర వాతావరణం నెలకొందని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వాటిని వ్యాపార అవసరాల కోసమే పెంచుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు..
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన యజమాని
దీనిపై ఆ అధికారి విచారణ చేపట్టారు. పోలీసు/రెవెన్యూ/మునిసిపల్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. మునిసిపాల్టీ నిబంధనల ప్రకారం వాటి పెంపకానికి లైసెన్స్ లేదని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. కుక్కలను ఆ ఇంటి నుంచి తరలించాలని ఆదేశించారు. ఆ అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని విక్రమ్ హైకోర్టును ఆశ్రయించాడు. పాత కక్షల వల్లే పొరుగువారు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నాడు. ‘నా ఇంట్లో నా ఇష్ట ప్రకారం కుక్కలను పెంచుకుంటున్నాను’ అన్నాడు. తన వద్ద పది లోపే కుక్కలు ఉన్నాయని వెల్లడించాడు.
హైకోర్టులో విచారణ
కాలనీ వాసులు చేసిన ఫిర్యాదు.. అధికారి ఆదేశాలు.. పిటిషనర్ పేర్కొన్న అంశాలను హైకోర్టు పరిశీలించింది. కేవలం కుక్కల సంఖ్య ఒక్కటే సమస్య కాదు. పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకోవడమూ తప్పు కాదు. కానీ, ఇతరులకు ఇబ్బంది కల్గించే స్థాయిలో వాటిని ఉంచడం వ్యక్తిగత హక్కుగా చెప్పలేమని పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ప్రజల ప్రశాంత జీవనాన్ని కూడా రక్షించాల్సిన అంశమేనని కోర్టు వ్యాఖ్యానించింది. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఉంటుంది. కానీ పక్కింటి వారి హక్కులకు భంగం కలిగించేలా అది ఉండకూడదని పేర్కొంది. ఆర్టికల్ 21కు విఘాతం కలిగించకూడదని చెప్పింది. ప్రజల హక్కులకు భంగం వాటిల్లినా, ఇబ్బంది కలిగించినా అటువంటి సందర్భాల్లో సంబంధిత అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 కింద ముందుగా చర్యలు తీసుకునే అధికారం ఉందని పేర్కొంది. ‘రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదు. చట్టపరమైన ఎటువంటి లోపమూ లేదు. వాటిని యథాతథంగా అమలు చేయవచ్చు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. రివిజన్ పిటిషన్తో పాటు ఇతర అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.
కుక్కలు మొరుగుతున్నాయి. నిద్రకు భంగం కలుగుతోందనే చిన్న కేసుగా ఇది మొదట కనిపిస్తోంది. ఎవరి ఇంట్లో వారు ఇష్టానుసారం జీవించే హక్కు ఉంటుంది. కానీ దానికి పరిమితులు ఉంటాయి. ఇతరుల ప్రశాంత జీవనానికి అది భంగం కలిగించనంత వరకే ఆ స్వేచ్ఛ అనేది ఈ కేసులో ప్రధానాంశం. కుక్కలు లేదా ఇతర జంతువుల పెంపకాన్నీ ఈ తీర్పు తప్పుపట్టడం లేదు. ఎన్ని జంతువులు ఉండాలనే సంఖ్యనూ నిర్ణయించలేదు. ప్రజా ప్రయోజనం, ఇతరుల జీవనంపై ప్రభావం, పబ్లిక్ న్యూసెన్స్ వంటి అంశాలనే కీలకంగా పరిగణించింది. సాధారణ అంశంగా కేసు మొదలై సామాజిక సందేశంతో ముగిసింది. - దిలీప్ మాదిరెడ్డి


