
ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్
గత కొంత కాలంగా ఈ టైటిల్ వేటలో ముందున్న భారత్
పోటీలకు హుందాతనం, గౌరవం ఆపాదించిన వైనం
హైదరాబాద్: నగర వేదికగా జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటం తర్వాత దాదాపు దీంతో సమానంగా అత్యంత గౌరవనీయమైన టైటిల్స్లో ఒకటి ‘బ్యూటీ విత్ పర్పస్’. ఈ పురస్కారం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో సామాజిక సేవాపరమైన కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయకంగా పనిచేసిన వారికి అందిస్తారు. ఈసారి జరిగే పోటీల్లో ఈ కిరీటం ఎవరిని వరించనుందోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
అందమైన రూపంతో పాటు హృదయం, సేవాభావం కలిగి ఉండే అభ్యర్థిని గుర్తించి అందించే ఈ టైటిల్ను 1972లో నిర్వాహకులు పరిచయం చేశారు. ఈ పోటీకి ప్రాణం పోసిన వ్యక్తి భార్య జూలియా మోర్లే ఆలోచనలతో దీన్ని రూపకల్పన చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో అందం ఒక్కటే కీలకంగా మారుతోందని గుర్తించి అది సరికాదని, సమాజానికి సేవ చేసే లక్షణాలు ఉన్నవారిని కూడా గౌరవించాలనే ఆలోచనతో ఆమె ఈ అవార్డును ప్రారంభించారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో అభ్యర్థుల స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తారు. ఈ పురస్కార విజేతలు తమ దేశాల్లోనే కాక, అంతర్జాతీయంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అంతేకాకుండా ఈ అవార్డు గెలుచుకున్న అభ్యర్థులకు మిస్ వరల్డ్ టైటిల్ (Miss World Title) గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.
పలు దేశాల్ని వరించిన టైటిల్..
ఇప్పటి వరకూ ఈ టైటిల్ గెలిచిన వారిలో మన దేశానికి చెందిన ఇషా గుప్తా ఒకరు. విద్యను ప్రోత్సహించే సేవా కార్యక్రమాల ద్వారా ఆమె గుర్తింపు పొందారు. అదే విధంగా మన దేశపు సుందరి మానుషి చిల్లర్ సైతం మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి 2017లో బ్యూటీ విత్ పర్పస్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆమె ఆ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలిచారు. ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేసిన మెక్సికన్ బ్యూటీ వనేసా పోన్ డీ లియోన్ 2018లో ‘బ్యూటీ విత్ పర్పస్’గా నిలిచారు. జమైకాకు చెందిన టోనీ–అన్ సింగ్ 2019లో మహిళా సాధికారతపై కార్యకలాపాలతో ఈ టైటిల్కి ఎంపికయ్యారు. అదే విధంగా పేద బాలికల విద్యను ప్రోత్సహించడానికి చేసిన కృషికి గాను సౌత్ఆఫ్రికాకు చెందిన సునేషా బుక్సన్ 2023లో టైటిల్ దక్కించుకున్నారు.
అద్భుత అవకాశం.. సేవా ప్రకాశం..
ఈ టైటిల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యక్రమాల్లో పాల్గొనగల అవకాశాలు వస్తాయి. అభ్యరి్థని అంతర్జాతీయ వేదికలపై పరిచయం చేస్తారు. ఈ టైటిల్ గెలిచిన అభ్యర్థి చేపట్టిన సేవా ప్రాజెక్టులకు మిస్ వరల్డ్ సంస్థ నుంచి ఆర్థికంగా సహాయం అందుతుంది. ఇది ప్రాజెక్టును విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. మిస్ వరల్డ్ ఫౌండేషన్ చేపట్టే ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఆహా్వనిస్తారు. వివిధ దేశాలకు వెళ్లి అక్కడి సేవా సంస్థలతో కలసి పని చేయడం జరుగుతుంది. మానుషి ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్ట్ శక్తి’ ప్రాజెక్ట్కు హర్యాణా ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. ఇది ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత శానిటరీ న్యాప్కిన్లను అందించేందుకు ఉపయోగపడింది. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ టూర్లో భాగంగా ఆమె కోల్కతా, ముంబైతో పాటు మన హైదరాబాద్లోనూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్య, ఆరోగ్య సమస్యలపై..
దక్షిణాఫ్రికాకు చెదిన బ్యూటీ విత్ పర్పస్ విజేత షుడుఫడ్జో ముసిడా తన ప్రాజెక్ట్ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. దక్షిణాఫ్రికాలో మానసిక ఆరోగ్య సమస్యలపై ఆమె చర్చలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పనిచేశారు. నేపాల్కు చెందిన ఇదే టైటిల్ విజేత శృంఖలా ఖతివాడ తన ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, శుభ్రత, ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టారు. మన దేశానికి చెందిన బ్యూటీ విత్ పర్పస్ (Beauty with Purpose) విజేత మానసా వరణాసి బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాకు చెందిన బ్యూటీ విత్ పర్పస్ విజేత శ్రీ సైనీ తన ప్రాజెక్ట్ ద్వారా గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గుండె ఆరోగ్యంపై చర్చలు నిర్వహించి, ప్రజల్లో ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించారు.