
సాష్ కార్యక్రమంలో సందడి చేసిన
మిస్ యూనివర్స్ ఔత్సాహికులు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారుల ఎంపిక 7, 8 తేదీల్లో గ్రాండ్ ఫినాలే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ సందడి ముగిసిందో లేదో మరో అంతర్జాతీయ గ్లామర్ వేదిక ‘మిస్ యూనివర్స్’ సందడి మొదలైంది. మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం నగరంలోని దస్పల్లా హోటల్ వేదికగా సాష్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్ ఈవెంట్లో తమ క్యాట్ వాక్తో అలరించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు.
అంతర్జాతీయ అందాల వేదికపై భారతీయ ప్రశస్తిని సగర్వంగా ప్రదర్శించేందుకు తెలుగు అమ్మాయిలు సన్నద్ధమవుతున్నారు, బ్యూటీ రంగంలో మన ప్రత్యేకతను చాటుకుంటున్నామని మిస్ యూనివర్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ భారత్కు ప్రాతినిథ్యం వహించడానికి విభాగాల్లో తలపడనున్నామని మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజాల్వెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
7, 8 తేదీల్లో గ్రాండ్ ఫినాలే..
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెస్టెంట్లకు ఈ నెల 6న మాదాపూర్లోని అరైవల్ హోటల్స్ వేదికగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. 7, 8 తేదీల్లో నగరంలోని ధారా రిసార్ట్ అండ్ కన్వెన్షన్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా విజేతకు కిరీటం ధరింపజేస్తారు. రాష్ట్ర సమాచార–సాంకేతిక, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.