
నగర జీవనంలో కోల్పోతున్న ప్రశాంతతను పొందడానికి కాలుష్యరహితమైన స్వచ్ఛమైన వాతావరణంలో కొన్ని రోజులైనా సేదతీరడానికి మనకు ఉన్న ఏకైక మార్గం హిల్ స్టేషన్స్. అందుకే సందు దొరికితే చాలు దగ్గర్లోని హిల్ స్టేషన్స్కి ఛలో అంటుంటారు నగరవాసులు. అయితే అందరూ అదే బాట పట్టడం వల్లనే...ఇప్పుడు ఊటీ లాంటి ఎన్నో హిల్ స్టేషన్స్ టూరిస్టుల రద్దీతో వాహనాల రణగొణధ్వనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
ఈ వేసవి సీజన్లో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యకు పరిమితి కూడా విధించారంటే... పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. హిల్ స్టేషన్స్ కూడా మన మహానగరాల్లా మారిపోతున్న నేపధ్యంలో...ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే ఉన్న ఒక అత్యంత కాలుష్యరహిత హిల్ స్టేషన్.
సహ్యాద్రి పర్వాతాల్లో...స్వచ్ఛంగా...
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో కొలువుదీరింది మాథెరాన్ హిల్ స్టేషన్. ఇది ఆసియాలోనే వాహనాలు పూర్తిగా నిషిద్ధం అయిన ఒకే ఒక్క పర్వత నగరం. దీని వల్ల పూర్తి కాలుష్య రహితమైన మంచి గాలీ, నీరు, వాతావరణ పరిసరాలు మనకి నిజమైన సేదతీరిన అనుభూతిని కలిగిస్తాయి.
భౌగోళికంగా దీని ఎత్తు సుమారు 800మీటర్లు (2,625 చ.అడుగులు) ఈ హిల్ స్టేషన్ ముంబైకు 90 కి.మీ., పూణేకు 120 కి.మీ.దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 2003లో కేంద్ర పర్యావరణ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. కాబట్టి మాథెరాన్ లోపల వాహనాలు వినియోగం పూర్తిగా నిషిద్ధం. అయితే అత్యవసరమైన సేవలకు ఈ–రిక్షా , అంబులెన్స్లను మాత్రమే అనుమతిస్తారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి?
మాథెరాన్ హిల్ స్టేషన్ హైదరాబాద్ కు సుమారు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది (రోడ్డు మార్గం ద్వారా). మీరు వెళ్లే మార్గం ప్రయాణ వాహనంపై ఆధారపడి దూరం కొంతమేర మారవచ్చు. రైలుమార్గాన్ని ఎంచుకుంటే.. హైదరాబాద్ నుంచి పుణే లేదా కార్జత్ / నెరల్ వరకు రైలు లో వెళ్లవచ్చు. నెరల్ స్టేషన్ నుంచి టాయ్ ట్రెయిన్ (అమన్ లాడ్జ్ – మాథెరాన్) ఎక్కవచ్చు.
లేదా టాక్సీ/జీప్ తీసుకుని మాథెరాన్ ఎంట్రీ పాయింట్ వరకూ వెళ్లొచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుంచి పుణే – లోనావాలా– నెరల్ వెళ్లవచ్చు. ప్రయాణ సమయం అంటే ఎంచుకున్న వాహనాన్ని బట్టి సుమారు 12 నుంచి 14 గంటలు వరకూ పడుతుంది. వాయు మార్గం ద్వారా అనుకుంటే ముంబైకి విమానం లో ప్రయాణించి అక్కడి నుంచి రైలులో లేదా టాక్సీ ద్వారా నెరల్ చేరుకొని మాథెరాన్ కు వెళ్ళవచ్చు.
పర్యాటకుల్ని చివరి పాయింట్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడ నుంచి టాయ్ ట్రైన్, గుర్రపు బగ్గీల ద్వారా హిల్స్టేషన్లోకి ప్రవేశించవచ్చు. వీలున్నంత వరకూ ఈ ప్రాంతంలో నడక ద్వారా మాత్రమే పర్యాటక స్థలాలు చూడడానికి ప్రయత్నిస్తే మరింత ఆరోగ్యకరమైన ఆక్సిజన్ను మనం అందుకోవచ్చు. అయితే హెరిటేజ్ టాయ్ ట్రెయిన్ను మాత్రం మిస్ అవ్వొద్దు. అమన్ లాడ్జ్ నుంచి మాథెరాన్ స్టేషన్ వరకూ ఈ ట్రైన్ ప్రయాణించడానికి సుమారు 20నిమిషాలు పడుతుంది.
ఇది 1907లో నిర్మించబడిన హిల్ రైల్వే, ప్రస్తుతం యునెస్కో వారసత్వ స్టేటస్ పొందిన ప్రసిద్ధ పర్వత రైళ్ళలో ఒకటి. దాదాపు 30కిపైగా అందమైన, వైవిధ్యభరిత అనుభూతిని అందించే వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ అలాగే ఈ ఊరిలో ఉండే ఇంగ్లీష్ కాలనీల ఆధునిక నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. మంచినీటి చెరువులు, పార్కులు, పచ్చదనం మనసును సేదతీరుస్తుంది.
నెరెల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2గంటలకు పైగా ప్రయాణించే టాయ్ ట్రైన్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది లోకల్ ట్రైన్ అయిన హెరిటేజ్ టాయ్ ట్రైన్కు అదనం. అయితే ఈ ట్రైన్ ఏడాదిలో సగం రోజులు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో అందుబాటులో ఉండదు. కాబట్టి. ఈ ట్రైన్ను ఆస్వాదించాలనుకుంటే నవంబరు తర్వాత మాత్రమే అది కూడా సమాచారం నిర్ధారించుకుని వెళ్లాలి.
(చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!)