నిర్మలవాణి
మానవ జన్మ పరమార్థం ఏమిటి?
అవతరించిన 10 మంది ఆది గురువులు
నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా జన్మించాను ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి ఈ జన్మ అయిన తర్వాత నా పయనం ఎటువైపు. చాలామంది సత్యాన్వేషకులలో ఈ ప్రశ్నలు తరచూ వారి మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు ప్రసాదించడానికి పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.
ఈ సహజ యోగం ద్వారా మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరం ఉనికిని గుర్తించి అనుభూతిపరంగా తెలుసుకొనవచ్చు. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ముడు నీవు కేవలం ఆత్మవు ఈ శరీరం బుద్ధి అహంకారం కాదు అని సుస్పష్టంగా తెలియజేశాడు. ఆరవ శతాబ్దంలో వచ్చిన శంకరాచార్యులు కూడా నీవు ఆత్మవు అని సంపూర్ణంగా వివరించి తెలియజేశారు.
బుద్ధుడు, మహావీరుడు కూడా పరమాత్ముని తెలుసుకొనుటకు ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అది గురు దత్తాత్రేయ పదిసార్లు ఈ భూమి మీద వివిధ ప్రదేశాలలో వివిధ సమయాలలో వచ్చి నీవు ఎవరవు అన్న విషయాన్ని తెలియజేయ ప్రయత్నించాడు. కబీర్ దాస్, భక్తవేమన, రమణ మహర్షి మొదలైన మరెందరో ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నీవు తెలుసుకో అని చెబుతూ వస్తూ ఉన్నారు. మనలో ఉన్న ఆత్మను తెలుసుకొనడానికి పరమాత్మునితో అనుసంధానం అవడం తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా బోధించారు మనల్ని ముందుకు నడిపించారు.
అవతరించిన 10 మంది ఆది గురువులు..
శ్రీ రాజా జనకుడు
మిథిలా రాజు, శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి (భారతదేశం సుమారు క్రీస్తుపూర్వం 8000).శ్రీ అబ్రహాం
ఇజ్రాయేలు, 12 గోత్రాల పూర్వికులు (ఇజ్రాయేలు సుమారు క్రీస్తుపూర్వం 2000).శ్రీ జరథుస్త్రుడు
ఏకేశ్వరవాదం, అగ్ని ఆరాధనను స్థాపించినవారు (పర్షియా సుమారు క్రీస్తుపూర్వం 1800).శ్రీ మోసెస్
యూదుల ధర్మశాస్త్ర స్థాపకులు (ఈజిప్ట్ సుమారు క్రీస్తుపూర్వం 1250).శ్రీ లావో–త్సు ‘‘టావో టే చింగ్’’ రచయిత
(చైనా జననం క్రీస్తుపూర్వం 604).శ్రీ కన్ఫ్యూషియస్
నైతిక విలువలను బోధించి ‘‘ఐ చింగ్’’ సంకలనం చేసినవారు (చైనా జననం క్రీస్తుపూర్వం 549).శ్రీ సోక్రటీస్
గ్రీకు తత్వశాస్త్ర స్థాపకుడు (గ్రీస్ జననం క్రీస్తుపూర్వం 431).శ్రీ మహమ్మద్
ఇస్లాం మత స్థాపకుడు (అరేబియా మరణం క్రీస్తుశకం 632).శ్రీ గురు నానక్
సిక్కు మత స్థాపకుడు (భారతదేశం జననం క్రీస్తుశకం 1469).షిర్డీ సాయినాథ్
శ్రీ మాతాజీ జననాన్ని ప్రవచించినవారు (భారతదేశం సుమారు 1840 – 1918 క్రీస్తుశకం).
ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనలో ఉన్న శక్తులను మనం తెలుసుకుని మన జీవితాన్ని వివేకం,విచక్షణ,జ్ఞానం, వినమ్రత, ప్రశాంతతతో ఆనందంగా జీవించడానికి మనలో ఉన్న శారీరిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక సామాజిక, ఆధ్యాత్మిక సమస్యల నుంచి బయటపడడానికి, మతకల్లోలాల నుంచి యుద్ధాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మనలో ఉన్న కుండలిని శక్తిని ఆత్మసాక్షాత్కారం ద్వారా జాగృతపరచుటకు ఆత్మను ప్రకాశవంతం చేసుకొనుటకు స్వీయ అనుభవం ద్వారా మనలో ఉన్న సూక్ష్మ శరీర అవగాహన చేసుకొనుటకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యల నుంచి బయటపడడానికి సహజ యోగ ధ్యానం ద్వారా విముక్తులు అయి అత్మసాక్షాత్కారం పొందండి.

– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు


