సువార్త
యేసు ఎటు కదిలితే అటు జనం. జనం ఎక్కడో ఆయన అక్కడ కాదు. యేసు ఎక్కడో అక్కడే జనం. రాత్రి తప్పించి ఆయనకు ఏకాంతం అనేదే లేని పరిస్థితి. పగలంతా అవిశ్రాంత పరిచారకుడిగా దీనజనులు, రోగులు, వివిధ సమస్యల బాధితుల సేవలో తరించే యేసు సాయంసంధ్య, ప్రత్యూషం వేళల్లో ఎక్కువగాప్రార్థనలలో గడిపేవాడు.
అధికసంఖ్యలో ప్రజలు తరలివస్తూ ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకొనుటలోను ఆయన్ను అనుసరించి వెంబడించుటలోనూ ఆనందించేవారు. సువార్త పాదయాత్రలలో ఆయన వెంట నడుస్తూ ఆయన నోటిమాటలు వినడానికి సామాన్య భక్త జనసమూహం ఎగబడడం వింతేమీ కాదు. ఎందుకంటే ఆయన అసాధారణ బోధలు, కార్యాలు అలాంటివి మరి.
జనసందోహం ఆయన్ను చుట్టుముడుతూ కమ్మేస్తూ ఒక్కచోట వేలాదిగా, పదివేలకొలదిగా సమకూడడం చూస్తే ఆ రోజుల్లో అదే గొప్ప సంచలనం! దీంతో రాజులు, అధికారులు వణికేవారు. సామాన్యులు, పామరులు, సుంకరులు, పాపులు తదితరులు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరడంతో పాపుల స్నేహితుడు అనే ముద్ర ఆయనపై వేసారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు.
ఎన్ని వెలివేతలు, కఠిన అంక్షలు విధించినా ఆయన్ను వెంబడించే ఈ విశేష బహు జనవాళిని చూస్తుంటే రోజురోజుకు పరిసయ్యుల కంటగింపు తారాస్థాయికి చేరుతుండేది. యేసుతో జనం లేకుండా చేయాలని వారు రోజూ అదే పనిగా అనేకనేక కుట్రాలోచనలు చేస్తుండేవారు. అయితే యేసు చేత లాజరు మృతులలో నుండి లేపబడుట ద్వారా పరిసయ్యుల నోళ్ళన్నీ ఒక్కసారిగా మూతలు పడ్డాయి. జనాన్ని కట్టుదిట్టం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వారు వెళ్లిపోయారు.
‘ . . కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు – మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి’ – యోహాను 12 : 9,18,19.
మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట ఆ దేవునికి అనుకోని యేసు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. సమాధిలో ఉన్న లాజరును పిలుస్తూ యేసు మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు కన్నులారా చూస్తూ ఆయనతో కూడా ఉన్న జనులు విస్తృతంగా ఈ సూచక క్రియను అంతటా ప్రచారం చేశారు. దీంతో యేసును పట్టుకొని చంపనాలోచించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పరిసయ్యులు.
దేవుని ప్రణాళిక నిర్ణయం మేరకు యేసు మరణం, అట్టి సమయం ఇంకా రాలేదు. యూదులకు అప్పగించుటకు వారు దుష్టులచేత సిలువ వేయించుటకు అనగా దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి యేసు మొదట యూదులకు అప్పగించబడాలి. ఇక యేసు యూదులలో బహిరంగంగా సంచరింపక అరణ్య సమీపంలోని ఎఫ్రాయిము అను ఊరిలో కొన్నాళ్ళు ఉన్నాడు. అటు తరువాత మరల యేసు పస్కా పండుగకు ఆరురోజులు ముందుగానే బేతనియ గ్రామానికి వచ్చి మరియ మార్తల ఇంట బస చేశాడు.
యూదులలో ఉన్న సామాన్యజనులు యేసు అక్కడ ఉన్నాడని తెలిసికొని యేసును చూచుటకు మాత్రమే కాక, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. అందుచేత ఆయన ఆ మహాత్కారం చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొనవచ్చారు. ఈ జనసందడిని చూస్తూ, మన ప్రయత్నాలన్నీ వ్యర్థం. మన ఆలోచనలు వృథా. ‘ఇదిగో లోకము ఆయన వెంటపోయింది’ అనుకుంటూ ఇలా పరిసయ్యులు తమ ఓటమి ఒప్పుకుంటూ వాపోయారు. జగమెరిగిన యేసు పాదయాత్రలలో దీనుల పాలిట దేవుని ప్రేమ అపారంగా కుమ్మరించబడింది. యేసు ప్రేమకు ఆ ప్రభావానికి లోనయి దాసోహం అయిన జన జీవితాలు ఆ రోజున ఆయన అడుగులో అడుగేస్తూ పులకించిపోయాయి. – జేతమ్


