కొంతమంది నిస్వార్థ సేవకు కేరాఫ్గా ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ..నిశబ్దంగా ఉంటారు. వారి సేవ ప్రజలో, మరెవరూ చూసి గుర్తించి చెబితే గానీ తెలియదు. అయినా మంచి పనికి హంగామా, ఆర్భాటాలతో పని ఉండదనిపిస్తుంది అలాంటి వాళ్లను చూస్తే. అచ్చం అలాంటి నిస్వార్థ సేవనే చేసున్నాడో వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూస్తే మానవత్వంపై నమ్మకం వస్తుంది.
స్వార్థపూరిత ప్రప్రంచంలో నిస్వార్థం మిణమిణకుమంటూ ఇంకా ఉందని అనిపిస్తుంది. ఆ వీడియోలో గురుగ్రామ్కు చెందిన ఒక వ్యక్తి బస్స్టాప్ వద్ద పేద పిల్లల సముహానికి పాఠాలు చెబుతుంటాడు. ఆ వీడియోలో పిల్లలంతా నేలపై చాప మీద కూర్చొని పుస్తకాలు, నోట్బుక్లతో కనిపించగా, మరొక చిన్నారి బోర్డుపై ఏదో రాస్తూ కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడి కనిపిస్తున్న వ్యక్తి పిల్లల వెనుక నిలబడి వారేవిధంగా నేర్చుకుంటున్నారో నిశితంగా పరిశీలిస్తుండటం చూడొచ్చు.
ఈ తతంగం మొత్తం అటుగా వెళ్తున్న కారులోని ఒక ప్రయాణికుడు రికార్డు చూసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి నిస్వార్థమైన పని చూని ముగ్ధుడవ్వడమే కాదు ఆ వ్యక్తిని అభినందించినట్లు తెలిపాడు. అక్కడున్న పిల్లలు కూడా ట్రాఫిక్ని, వాహనాలను ఏమి పట్టించుకోకుండా చదువుపై దృష్టిసారించడం విశేషం.
ఇలా బహిరంగ ప్రదేశాన్ని తరగతి గదిగా మార్చి, చదువుకోవడానికి వచ్చే పేద పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మనుసుకు హత్తుకునే ఈ దృశ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తరగతి గది నాలుగు గోడల మధ్యే కాకుండా, ఆరు బయట కూడా విద్యను అభ్యసించవచ్చని ఈ సంఘటన గుర్తుచేస్తుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు తగ్గింది..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..)


