సత్ఫలితాలనిస్తోన్న వీధి శునకాల దత్తత
జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న శిబిరాలకు ఆదరణ
కుటుంబ సభ్యుల్లా కలిసిపోతున్నాయని ఆనందం
జంతు ప్రేమికులకు ‘ఇన్ఫోసిస్’ సుధామూర్తి సూచనలు
గత కొంత కాలంగా నగరవ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహిస్తున్న వీధి శునకాల దత్తత కార్యక్రమం నెమ్మదిగా సత్ఫలితాలనిస్తోంది. ఈ శిబిరాలతో పాటు పలు మార్గాల ద్వారా స్ట్రీట్ డాగ్స్ను ఇంటికి తెచ్చి పెంచుకునేవారు పెరుగుతున్నారు. వాటితో తమకి చక్కని అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్స్గా ఎంచుకోవడానికి గొప్ప గొప్ప బ్రీడ్స్ మాత్రమే అవసరం లేదని, ఈ వీధి శునకాలు సైతం చక్కని తోడుగా మారతాయని అంటున్నారు.
పిల్లలకు బాధ్యత నేర్పింది..
బషీర్బాగ్కు చెందిన డ్రైవర్ యాదగిరి జీహెచ్ఎంసీ (GHMC) వారాంతపు డ్రైవ్లో ఒక కుక్కని దత్తత తీసుకుని శంషాబాద్లోని తన మనవళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను వారికి అర్థవంతమైన బహుమతి ఇవ్వాలనుకున్నా. కేవలం కొన్ని రోజులు వాడి పడేసే బొమ్మ కాకుండా.. ప్రేమను నేర్పే కుక్కపిల్లని ఇచ్చాను. అప్పటి నుంచీ పిల్లలు దాంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి క్రమం తప్పకుండా పాలు, గుడ్లు తినిపిస్తున్నారు. అంతకు ముందు కన్నా చాలా బాధ్యతగా మారారు’ అని యాదగిరి అంటున్నారు. వీధుల్లో నుంచి ఆ శునకం సరాసరిగా తమ ఇంట్లోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని అంటున్నారాయన.
గ్రహణశక్తి అమోఘం..
‘ఇది చాలా త్వరగా మమ్మల్ని అర్థం చేసుకుంది. మేం పెద్దగా శిక్షణ ఇవ్వకపోయినా మాతో పాటు మంచం మీద పడుకుంటుంది.. బాత్రూమ్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తుంది’ అని శ్రీనివాస్ వెల్లడించాడు. 12 మంది కుటుంబ సభ్యులు ఉన్న శ్రీనివాస్ ఉమ్మడి కుటుంబంలో పప్పీ అందరికీ చేరువగా మారింది. ‘పిల్లలు వృద్ధులతో సహా మాలో ఎనిమిది మంది దాని బాగోగులు చూసుకుంటున్నాం. పాలు, పెరుగు అన్నంతో పాటు పెట్ ఫుడ్ అందిస్తున్నాం’ అంటూ శ్రీనివాస్ చెబుతున్నాడు.

నీడనివ్వాలి అనుకున్నా..
‘చాలాసార్లు, దారినపోయే వీధి కుక్కలపై చిన్నా పెద్దా తేడా లేకుండా రాళ్లు విసరడం, వాటితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చూసి బాధ కలిగేది. కనీసం వాటిలో ఒకదానికైనా సురక్షితమైన నీడ ఇవ్వాలని అనిపించింది’ అని గుర్తు చేసుకున్నారు రాయ్. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఓ కుక్కని ఇస్నాపూర్ నుంచి ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. ‘మొదట నెల పాటు సింబా (కుక్కకి పెట్టుకున్న పేరు) మాతో మమేకం కావడానికి సమయం తీసుకుంది. వీధుల్లో స్వేచ్ఛగా సంచరించేది కావడంతో.. నాలుగ్గోడల మధ్య సర్దుబాటు చేసుకోవడం కొంచెం కష్టమైంది.. క్రమంగా స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఇప్పుడు మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటోంది గొప్ప రక్షణగా మారింది. వచ్చే వరకూ మా కోసం తలుపు దగ్గర వేచి ఉంటుంది’ అని రాయ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఆమెకు తోడు.. ముచ్చటగా మూడు..
నగరంలో ఓ స్టార్టప్ నిర్వాహకురాలైన ఆశా టంపాకు, ఇండీ కుక్కలను దత్తత తీసుకోవడం ఒక జీవన విధానంగా మారింది. నా మూడు కుక్కలు ఒకప్పుడు వీధి కుక్కలే. వాటి సంరక్షణకు సురక్షితమైన స్థలం అవసరం’ అని ఆమె అంటున్నారు. అలా ఆశా దత్తత తీసుకున్న మూడో వీధి కుక్క పేరు ‘కూపర్’. దాదాపు సంవత్సరం క్రితం, ఓ ఎన్జీఓ నుంచి రెండు నెలల వయసున్న వీధి కుక్క.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం తెలిసింది. ఎవరు జోక్యం చేసుకోకపోయినా బ్రతికేది కాదు. దానికి వెంటనే వైద్య సహాయం సరైన చికిత్స అందించాను. ప్రస్తుతం కూపర్ ఆరోగ్యంగా, ఉల్లాసంగా మాతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. నా స్నేహితులతో కలిసిపోతూ ఆడుకుంటుంది’ అని కూపర్ ముచ్చట్లు పంచుకున్నారు.

ఇవి గుర్తుంచుకోండి..
⇒ వీధి కుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి భద్రత కలిగిన శాశ్వత నివాసాన్ని అందించడం ఓ సబబైన మార్గం. అదే విధంగా రోజువారీ పనుల ద్వారా వాటికి ఆసరా అందించాలి.
⇒ దయచేసి కుక్కలపై రాళ్లు రువ్వడం చేయవద్దు. మనం కేవలం కుక్కకు ఒక రొట్టె ముక్క, ఒక పిడికెడు అన్నం పెడితే చాలు, అవి మన కోసం తమ ప్రాణాలను ఇస్తాయి.
⇒ కారంగా ఉన్న, మనం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వాటికి తినిపించవద్దు. వాటి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందించాలి.
⇒ నగర వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర తేడాలు ఏర్పడినప్పుడు ప్రజలు వాటికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలి.
⇒ వీధికుక్కల సంఖ్య భారీగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సహకరించాలి. అలాగే వీధి కుక్కలను క్రిమిరహితం చేయడానికి కూడా.
⇒ జంతువుల పట్ల కరుణ చూపడాన్ని పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ డాగ్ షెల్టర్లకు తీసుకెళ్లాలని సుధామూర్తి (Sudha Murthy) సూచించారు.
వీధికుక్కల పట్ల నిర్దయ వద్దు..
‘జంతువులు సైతం మన సమాజంలో అంతర్భాగమే. వీధి కుక్కల పట్ల సానుభూతి చూపాలి. నా పెంపుడు శునకమైన గోపి గురించి అనేక పుస్తకాలు రాశా. నిరంతర సహచరుడైన గోపీకి, నాకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. శీతాకాలంలో గోపికి పలువురు చిన్నారులు శాలువాలు పంపుతారు. మైసూరు దసరా వేడుకల సమయంలో సన్మానిస్తారు.’ అంటూ గోపితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
– సుధామూర్తి, రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్

ఫిల్మ్ నగర్కు చెందిన పాఠశాల విద్యార్థి ఆర్ శ్రీనివాస్ గత శనివారం కేబీఆర్ పార్కులో (KBR Park) జరిగిన కార్యక్రమంలో ఒక ఇండీని దత్తత తీసుకున్నాడు. ‘మేం తొలుత దీన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, టీకా ప్రభావం కారణంగా నీరసంగా ఉంది. మొదటి రెండు రోజులు, చాలా ఎక్కువగా నిద్రపోయింది. కానీ మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకుని చురుకుగా మారింది. దాని గ్రహణ శక్తి తమని ఆశ్చర్యపరుస్తోంది’ అని అంటున్నాడు.
చదవండి: హైదరాబాద్లో మితిమీరిన సోషల్ మీడియా వినియోగం
బీరంగూడకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ రాయ్ ఇటీవలే ఒక ఇండీ డాగ్ని దత్తత తీసుకున్నారు. ‘ఇండీ కుక్కపిల్లని దత్తత తీసుకోవడం మా ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. వాటికి ప్రేమ, సమయం మాత్రమే అవసరం. అవి మనల్ని విశ్వసించిన తర్వాత, మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే తిరిగి ఇస్తాయి’ అంటారాయన. – సాక్షి, సిటీబ్యూరో


