జుట్టు పట్టులా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తలకు గోరువెచ్చని కొబ్బరినూనె రాసి, సుతారంగా మర్దన చేసి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తల పొడిబారిపోకుండా ఉండటానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది.
షాంపూ చేసిన ప్రతిసారీ జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసి.. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోవచ్చు. అందుకని వెంటనే గట్టిగా దువ్వకుండా, కొద్దిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీయాలి.


