సాక్షి స్పెషల్ డెస్క్: ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యూకేలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ ఒక గ్లాసు సహజమైన పండ్ల రసం లేదా స్మూతీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడమే కాకుండా డిప్రెషన్ లక్షణాలు తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకునే 42 మంది వ్యక్తులపై 4 వారాల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. పాల్గొన్నవారిని వివిధ గ్రూపులుగా విభజించి, ఒక గ్రూప్కు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గ్లాసు 100 శాతం స్వచ్ఛమైన పండ్ల రసం లేదా స్మూతీ అందించారు. 4 వారాల ముగింపులో, ప్రతిరోజూ పండ్ల రసం తాగిన వారిలో డిప్రెషన్ స్కోరు గణనీయంగా తగ్గడం గమనించారు.
ఆరోగ్యకర ప్రయోజనాలు
⇒ సాధారణంగా జ్యూస్లలో సహజంగా ఉండే చక్కెరల వల్ల బరువు పెరగడం లేదా జీవక్రియ దెబ్బతినడం జరుగుతుందనే ఆందోళన ఉంటుంది. అయితే పరిమిత పరిమాణంలో తాగిన జ్యూస్.. మెటబాలిజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపటం లేదని పరిశోధకులు గమనించారు.
⇒ పండ్లలో పుష్కలంగా లభించే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను అడ్డుకోవడంతో పాటు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను (వాపు) ను గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి.
⇒ ఈ పోషకాలన్నీ మన శరీరంలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే సెరోటోనిన్, డోపమైన్ వంటి మూడ్ బూస్టింగ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, వాటి సమతుల్యతను కాపాడటానికి అనుకూలమైన వాతావరణాన్ని కలి్పస్తాయి. సాధారణంగా ప్రతిరోజూ కావాల్సిన మోతాదులో నేరుగా పండ్లను నమిలి తినడం చాలామందికి వీలుపడదు. అలాంటి వారికి ఒక చిన్న గ్లాసు జ్యూస్ లేదా స్మూతీ ద్వారా ఆ పోషకాలన్నీ శరీరానికి చాలా సులభంగా అందుతాయి.


