ఓ మహిళా కళాకారిణి చిత్రించిన పెయింటింగ్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. అది కూడా ఒక మహిళ ప్రాణంపోసిన కళాకృతికే ఈ ఘనత దక్కడం అందర్నీ ఆశ్చర్యానందంలో ముంచెత్తింది. పురుష కళాకారులను అందర్ని వెనక్కినెట్టి మరీ ఇంత పెద్దమొత్తంలో ధర పలకడంతో ఆ చిత్రంలో దాగున్న విశేషం ఏంటని సర్వత్రా ఆసక్తి రెక్తిత్తించింది. అది ఆ కళాకారిణి స్వీయ చిత్రమట. అందులో పొందుపర్చిన భావం, దాని వెనుకున్న కథ వింటే..ఈ చిత్రంలో ఇంత అర్థావంతమైనదా అని ఆశ్చర్యం కలుగక మానదు. మరి ఆ పెయింటింగ్ కథ కమామీషు ఏంటో చకచక చదివేద్దామా.!.
ఆ అపురూపమైన కళాఖండాన్ని చిత్రించింది మెక్సికన్ కళాకారిణి ఫ్రిదా కహ్లో. దీన్ని ఎల్ సుయెనో (లా కామా)" అనే పేరుతో 1940లో చిత్రించింది. "ది డ్రీమ్ (ది బెడ్)" అనే ఆర్ట్వర్క్ విభాగంలో భాగంగా ఇది వేలంలో ఏకంగా రూ. 487 కోట్లకు అమ్ముడుపోయింది. అది కూడా జస్ట్ నాలుగు నిమిషాల్లోనే ఈ రేంజ్లో పలకడం విశేషం.
మునుపటి రికార్డుని బ్రేక్ చేసింది ఈ ఆర్ట్. గతంలో అమెరికాకు చెందిన మరో మహిళా కళాకారిణి జార్జియా ఓ'కీఫ్ పేరు మీదున్న రికార్డును ఈ పెయింటింగ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబైస్ (Sotheby's) పేర్కొంది.
ఏం చెబుతుందంటే..
ఈ చిత్రం కళాకారిణి కహ్లో కెరీర్లో కీలకమైన దశాబ్దంలో చిత్రించిన పెయింటింగ్ అట ఇది. కహ్లో మాజీ ప్రేమికుడు హత్యకు గురైన ఏడాది, ఆ తర్వాత ఆమె విడాకులు పునర్వివాహం పరిణమాల మధ్య ఆమె మనసులో చెలరేగిన భావోద్వేగాన్ని వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..పూర్తిగా ఇది ఆమె వ్యక్తిగత చిత్రం.
దీనిలో ఇంత అంతరార్థం ఉందా..?
ఆకాశంలో మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనిపించే మంచంలో, డైనమైట్ కర్రలతో చుట్టబడిన కాళ్ళతో కూడిన అస్థిపంజరం పడుకుని ఉంటుంది. అలాగే దానికింద ఉన్న మరో బెడ్పై పూల పందిరిలో హాయిగా నిద్రిస్తున్నట్లు కళాకారిని కనిపిస్తుంది. పై బెడ్లో డైనమైట్తోకప్పబడిన అస్థిపంజరం శారీరకంగా, మానసికంగా కష్ట సమయాల్లో ఆమె స్థితిస్థాపకతను సూచిస్తుంది.
అలాగే కింద బెడ్పై సర్వాంగ సుందరంగా ఆకుల పందిరిలో పడుకున్నట్లు కనిపిస్తున్న చిత్రం..ఆమె సంబంధాలు, అనారోగ్యంతో చేస్తున్న పోరాటాన్ని తెలుపుతుంది. అంతేగాదు మెక్సికన్ సంస్కృతి, జానపద మూలాంశాలు, యూరోపియన్ సర్రియలిజం(మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఉద్భవించిన ఒక కళాత్మక ఉద్యమం) వంటివి ప్రస్ఫుటంగా కనపిస్తాయి.
ఈ పెయింటింగ్ కంటే 1932 నాటి పెయింటింగ్ "జిమ్సన్ వీడ్/వైట్ ఫ్లవర్ నంబర్ 1" 2014లో $44.4 మిలియన్లు (రూ. 391 కోట్లు) పలకడం విశేషం. దీన్ని ఆమె భర్త, కుడ్యచిత్రకారుడు డియెగో రివెరాతో కలిసి చిత్రించింది. కాగా, 1954లో మరణించిన ఫ్రిదా కహ్లో, గొప్ప చిత్రకారులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందిన కళాకారిణి.
ముఖ్యంగా సెల్ఫ్(వ్యక్తిగత చిత్రాలకు) పెయింటింగ్లకు పేరుగాంచిన కళాకారిణి. ఆ పెయింటింగ్స్ అన్ని తరచుగా ఆమెకున్న శారీరక మానసిక బాధల్ని వ్యక్తపరుస్తాయి. ఆమె బాల్యంలో పోలియోతో బాధపడింది. ఆ తర్వాత బస్సు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపాలైంది. ఆయా కష్ట సమయాల్లో తన మానసిక స్థితిని ప్రతిబింబించేలా చిత్రిస్తుందామె. నిజంగా ఒక చిత్రం ఇన్ని విషయాలను వెల్లడిస్తుందా..అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
(చదవండి: పశ్చిమ్ కా పరంపర..! రేపటి నుంచి 'భారతీయ కళా మహోత్సవ్')


