సామాజిక కోణంలో చేసే నివేదికలు ఆప్రాంత, రాష్ట్ర, దేశంలోని జనాభా మనుగడ ఏ స్థాయిలో ఉందో సూచిస్తాయి. దీనిలో భాగంగానే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 5.4 శాతం మంది మహిళలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయినవారు ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే పెద్ద రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు 11.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపుకు పైగా ఉంది. కేరళలో 10.4 శాతం ఉండగా దాని తర్వాతి స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 8.6 శాతం, 8.0 శాతం, 7.6 శాతం వాటాలను నమోదు చేశాయి. ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు కలిసి జాతీయ స్థాయిలో మొదటి ఏడు స్థానాలలో ఐదింటిని ఆక్రమించాయి. బిహార్లో అత్యల్పంగా 2శాతంతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా ఉంది.
దేశంలో ఈ ఐదు రాష్ట్రాలలోనే వితంతువులు, ఒంటరి, వృద్ధ మహిళా జనాభా అధికంగా ఉండటానికి గల కారణాలను ఎస్ఆర్ఎస్ శోధించింది. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, స్వతంత్రంగా జీవించడం, పనిచేసే వయస్సులో పురుషుల మరణాలు అధికంగా ఉండటం గమనించింది.
ఇదే విషయంలో జాతీయ స్థాయిలో పురుషుల జాబితా చూస్తే.. భార్యను కోల్పోయిన, విడాకులు తీసుకున్న లేదా విడిపోయినవారి సగటు శాతం 1.6 ఉంది. కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 1.6 శాతం నమోదు కాగా, తమిళనాడు 2.9 శాతంతో అత్యధికంగా ఉంది. అయినప్పటికీ మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ శాతం చాలా తక్కువ. తమిళనాడులో జీవిత భాగస్వామి లేకుండా జీవిస్తున్న స్త్రీ, పురుషుల వాటాల మధ్య వ్యత్యాసం 8.7 శాతం పాయింట్లు కాగా, కేరళలో ఈ అంతరం 8.6 శాతం పాయింట్లుగా నమోదైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ వ్యత్యాసం 3.8 శాతం పాయింట్లతో జాతీయ సగటును మించిపోయింది.


