
యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్స్ ఎగ్జామ్లో సక్సెస్ని ముద్దాడటం కోసం యువత ఎంతగా తపిస్తుందో తెలిసిందే. అయితే అందరూ విజయాన్ని అందుకోలేరు. కొందరికి తీరని కలగా మిగిలిపోతుంది. ఇక అలా డిప్రెషన్లోకి వెళ్లక.. మరొక మార్గం ఎంచుకుని అచంచలంగా ఎదుగుతూ శెభాష్ అనిపించుకునేలా బతికి చూపించారు ఈ ఇద్దరు మహిళామణులు. ఇద్దరిది ఒక్కో నేపథ్యం, కానీ లక్ష్యం ఒక్కటే. కానీ ఇద్దర్నీ ఆ సివిల్స్ ఎగ్జామ్ విజయం అందుకోలేరని వికటాట్టాహాసం చేసింది. ఇనాళ్లపడ్డ శ్రమ, టైమ్, డబ్బు వేస్ట్ అయిపోయాయి అనేంత మనోబాధే మిగిలింది. అయినా దాన్ని కూడా తట్టుకుని మరో రంగంలో సక్సెస్ వస్తుందేమోనని ధైర్యంగా ముందడుగు వేశారు. అదే వారిని ఊహకందని సక్సెస్ని చవిచూసేలా చేసింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచేలా చేసింది.
వివరాల్లోకెళ్తే.. ప్రతి ఏడాది లక్షలాదిమంది విద్యార్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయికి చేరాలనుకుంటారు. అయితే అది అందరికీ అంత ఈజీగా దక్కే విజయం మాత్రం కాదు. కొందరూ మాత్రం త్రటిలో చేజార్చుకున్న పరాజితులుగా మిగిలిపోతారు. అలాంటి పరాజితులే కాజల్ శ్రీ వాస్తవ్, వేద గోగినేనిలు.
అయితే ఇద్దరికి సివిల్స్ పరీక్ష రాసే ఛాన్సలన్నీ వృధా అయిపోయాయి. కళ్లముందు శ్రమ అంతా ఆవిరై పోయిందనే వేదన వారి మనసులను ఓ పట్టాన నిలువనీయలేదు. అయితే వారు అక్కడితే ఓడిపోయామని ఆగిపోలేదు. ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాప్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.
స్వదేశీ స్పోర్ట్స్ వేర్ వ్యవస్థాపకురాలు..
అక్టోబర్ 24, 2020న కాజల్ తన యూపీఎస్సీ పరీక్ష ఆరవ ప్రయత్నంలో విఫలమయ్యాక తీవ్ర నిరాశకు లోనైంది. అనవసరంగా ఈ వైపుకి వచ్చి సమయం వృధా చేసుకున్నానని మధనపడుతూ ఉంది. ఇప్పుడు ఇదికాదు.. నా మనసుకు అత్యంత ప్రశాంత కావాలని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమె సోదరి జోక్యం చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పి.. మరో రంగం ఎంచుకోమని సూచించింది.
సివిల్స్లో విఫలమైతే జీవితం పోయినట్లు కాదని గుర్తు చేసింది. అయితే సమయం, డబ్బు వృధా చేసేనన్న గిల్టీ ఫీలింగ్ కాజల్ని స్థిమిత్తంగా ఉండనివ్వలేదు. దాంతో ఆమె మానసిక ప్రశాంతత నిచ్చే పని కోసం వెతకడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే పురాతన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టును నేర్చకునేందుకు ఆసక్తి కనబర్చింది.
అదే ఆమె జీవతాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఒక రకంగా నిరాశనిస్ప్రుహలో ఉన్న ఆమెకు తనను తాను నయం చేసుకునే మందులా ఆ విద్య కనిపించిందామెకు. పైగా ఆ రంగంలో రాణించి..ఆ కళను ప్రోత్సహించేలా వర్క్షాప్లు నిర్వహించింది. అలాగే వ్యాపార రంగంలోకి కూడా అగుడుపెట్టి.. స్వదేశీ స్పోర్ట్స్ వేర్ను స్థాపించింది. అలా ఈ రంగంలో సక్సెస్ని అందుకుంటూ..గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా పేరుతెచ్చుకుంది.
ఎర్త్ఫుల్ వ్యవస్థాపకురాలు ..
వేద గోగినేని ముంబైలోని డ్యూయిష్ బ్యాంక్లో మంచి ఉద్యోగం చేస్తుండేది. త్వరలో లండన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. అయినా..2015లో ఆమె జీవితాన్నే మార్చే అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన యూపీఎస్సీ కలను సాధించేందుకు అంత మంచి ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చి అక్కడే చిన్న ఇరుకుగదిలో...రూమ్మేట్తో కలిసి ప్రిపేరవ్వడం ప్రారంభించింది.
మూడున్నేర ఏళ్లు ప్రిపరేషన్కి అంకితమైన జస్ట్ ఒక్క మార్కు తేడాతో కటాఫ్ మార్కులు మిస్ చేసుకునేది. అయితే ఈ ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిలైనా.. మళ్లీ మొదటి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేయాల్సిందే. దీంతో ఇలా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాను అనే బాధ ఆమెను దారుణంగా కుంగదీయడం ప్రారంభించింది.
ఇక ఆమె ఏది గెలవలేను అనే ఆత్మనూన్యత భావనకు వచ్చేసింది. అలాంటి సమయంలో ఆమె తల్లి అక్కున చేర్చుకుని మరో రంగంలోకి అడుగులు వేయమని సూచించింది. అలా ఆమె తన సోదరి సుధతో కలిసి 'ఎర్త్ఫుల్' అనే ప్లాంట్ ఆధారిత సప్లిమెంట్స్ కంపెనీని స్థాపించింది. ఈ స్టార్టప్ షార్క్ ట్యాంక్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేగాదు 75 లక్షల పెట్టుబడిని కూడా పొందింది.
నిజంగా ఆమెకు ఇది..ఇన్నాళ్లు చవి చూసిన ఓటములకు ఓదార్పు ఈ అతిపెద్ద సక్సెస్. ఇప్పుడామె ఓ సహ వ్యవస్థాపకురాలిగా మరిన్ని విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడూ సివిల్స్ గెలవనందుకు బాధపడటం లేదని ఆనందంగా చెబుతున్నారు. మమ్మల్ని అంతకుమించిన స్థాయిలో నిలబెట్టేందుకే తామిద్దరం అందులో విజయం అందుకోలేకోయేమేమో అని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు.
తరుచుగా వింటుంటాం.. వైఫల్యాన్ని అంగీకరించి.. వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోవాలని అంటుంటారు పెద్దలు. ఒకచోట చవిచూసిన ఓటములు మరో రంగాన్ని ఎంచుకున్నప్పుడూ జాగ్రత్తను, తట్టుకోవడాన్ని నేర్పిస్తాయి. అందుకు ఉదహారణే ఈ ఇద్దరూ విజేతలు.
చదవండి: 'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పాక్ తండ్రి..