
వేర్వేరు కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఒకే చోట ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడమనే కో–వర్కింగ్ స్పేస్ కాన్సెప్ట్ నగరంలో విజృంభిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఊతమిచ్చేలా కో–వర్కింగ్ స్పేస్ అందించే సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యకు చేరుకోవడం విశేషం.
అత్యంత అధునాతన ఆఫీసులను డిజైన్ చేసి, సంస్థ అవసరాలను బట్టి కనీసం ఐదుగురి నుంచి 500 మంది ఉద్యోగుల వరకూ అవసరమైన స్పేస్ను కో–వర్కింగ్ స్పేస్ ఆఫర్ చేసే సంస్థలు అందిస్తున్నాయి. వర్క్ స్టేషన్కి ఇంత చొప్పున స్థలాన్ని కేటాయించి, దానికి అనుగుణంగా వీరు చార్జ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆఫీస్కు సంబంధించి ఏ బాదర బందీ సదరు కంపెనీకి ఉండదు.
సెక్యూరిటీ మొదలు పెడితే.. క్యాబిన్స్, సర్వర్ రూమ్స్, సర్వర్ ర్యాక్స్, ఇంటర్నెట్, కెఫెటేరియా, లాబీస్పేస్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఇలా.. ప్రతిదీ అందుబాటులో ఉంటాయి. సేవలు అందించడానికి అవసరమైన మ్యాన్ పవర్ సైతం సిద్ధంగా ఉంటుంది. సంస్థ ఉద్యోగుల సంఖ్య పెరిగినా కేవలం 15 రోజుల వ్యవధిలో పెరిగిన ఉద్యోగులకు సరిపడా స్పేస్ విస్తరింపజేస్తారు.
రెడీమేడ్ ఆఫీసులకు ఊతం..
‘ఈ రోజు బిజినెస్ ఐడియా వస్తే.. రేపు కంపెనీ అనౌన్స్ చేసేయడానికి ఈ రెడీమేడ్ ఆఫీసులు సహకరిస్తాయి. కొన్నేళ్ల క్రితం కొండాపూర్లో 12,500 చదరపు అడుగుల్లో 200 సీటింగ్ కెపాసిటీతో కో–వర్కింగ్ స్పేస్ స్టార్ట్ చేస్తే అది కేవలం రెండు నెలల్లో ఫిలప్ అయిపోయింది.
ఆ తర్వాత బంజారాహిల్స్లో 95వేల చదరపు అడుగుల్లో 1800 సీటింగ్ కెపాసిటీ ఉన్నది ఏర్పాటు చేశాం. స్టార్టప్స్కి అకౌంటింగ్, జీఎస్టీ రిటర్న్స్ తదితర అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తున్నాం. ప్రస్తుతం మేం అందిస్తున్న స్పేస్లో వందలాది కంపెనీలు ఆఫీసులు నిర్వహిస్తున్నాయి’ అంటూ వివరించారు ఐ స్ప్రౌట్స్ నిర్వాహకులు సుందరి.
ఇంతింతై..స్పేస్ కొండంతై..
ప్రారంభంలో ఈ కాన్సెప్ట్ సృజనాత్మక రచయితలు, ఆర్టిస్టులు, ఫ్రీలాన్సర్లకే పరిమితమైంది. అయితే ఐటీ, ఎంఎన్సీలు, స్టార్టప్లు కో–వర్కింగ్లోకి రంగప్రవేశం చేయడంతో ఈ ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత కంపెనీలు స్టార్టప్లలో ఫ్లెక్సీ వర్క్స్పేస్ కాన్సెప్్టకు ఆదరణ పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకారం, దేశంలోని టాప్–7 నగరాల్లో మొత్తం 20.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్లో, కో–వర్కింగ్ స్పేస్ వాటా దాదాపు 25%గా ఉంది.
కేఫ్స్, హోటల్స్, మాల్స్లోనూ..
కో–వర్కింగ్ ప్లేస్లు ఇప్పుడు నగరాల్లోని మాల్స్, హోటల్స్, కేఫ్స్కు కూడా విస్తరించడం గమనార్హం. ఇటీవలే వియ్ వర్క్ అనే గ్లోబల్ కంపెనీ, అమీర్పేటలోని ఎంపీఎమ్ మాల్లో తమ కో–వర్కింగ్ స్పేస్ను ప్రారంభించింది.
అలాగే నగరంలో 25 సెంటర్స్ను నిర్వహిస్తున్న బ్రాండ్.. ‘ఆఫీస్(ఏడబ్ల్యూఎఫ్ఐఎస్)’ ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 40,000 సీటింగ్ను జోడించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ను స్మార్ట్వర్క్స్ కో–వర్కింగ్ స్పేసెస్ ఇటీవలే లీజుకు తీసుకుంది.
పోటాపోటీగా వసతులు..
ఈ కో–వర్కింగ్ స్పేస్లోకి కంపెనీలు ఆకర్షించడానికి పేరొందిన జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ‘మా కో–వర్కింగ్ స్పేస్లో కనీసం 300 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ, ప్రైవేట్ క్యాబిన్లు, డెడికేటెడ్ డెస్క్లు, హాట్ డెస్క్లు, మీటింగ్ రూమ్లు, కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మా టీమ్ ప్రతిరోజూ నిర్వహణా బాధ్యతల్ని పర్యవేక్షిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది’ అని నగరంలో కో–వర్కింగ్ స్పేస్ నిర్వహిస్తున్న స్ప్రింట్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు.
దేశంలో మనమే ముందు..
నగరంలోని ఆఫీస్ మార్కెట్ గతేడాది ప్రథమార్ధలోనే 50 లక్షల చదరపు అడుగుల లీజును దాటేసింది. హైటెక్ సిటీ, గచి్చబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు వర్క్స్పేస్ల కోసం పెరుగుతున్న డిమాండ్కు అద్దం పడుతున్నాయి. దేశంలో ఫ్లెక్సిబుల్ కో–వర్కింగ్ స్పేస్లను అందించడంలో హైదరాబాద్ ముందుందని ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో స్థలాలకు వ్యయం చాలా తక్కువని ఆయన అంటున్న మాట. పాశ్చాత్య దేశాల్లోని పలు నగరాల్లో దాదాపు 50 శాతం కో–వర్కింగ్ స్పేస్లే ఆక్రమించాయి. ప్రస్తుతం నగరంలో వీటి విజృంభణ చూస్తుంటే భవిష్యత్తులో వాటి సరసన మన నగరమూ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.