కేన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? | Cancer Cases in India State wide statistics details | Sakshi
Sakshi News home page

Cancer: మూడేళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన కేన్సర్‌ కేసులు

Jun 25 2025 5:51 PM | Updated on Jun 25 2025 6:20 PM

Cancer Cases in India State wide statistics details

ఇదే కొనసాగితే 2040 నాటికి తీవ్రరూపం

అత్యధికంగా రొమ్ము, గొంతు, రక్త, నోటి కేన్సర్‌లు

విస్తృతిలో ముందున్న యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌

8, 11 స్థానాల్లో ఏపీ, తెలంగాణ

హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్‌ కేసులు.. ఉమ్మడి వరంగల్‌లో రక్త, ఎముక కేన్సర్‌లు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: విస్తృతంగా విస్తరిస్తున్న కేన్సర్‌ మహమ్మారి ప్రజలు, ప్రభుత్వాలకు సవాల్‌ విసురుతోంది. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి దేశాన్నే కలవరపెడుతోంది. చాపకింద నీరులా అయిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో కేన్సర్‌ కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9 శాతం, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం రొమ్ము, గర్భాశయ ముఖద్వార, రక్త, నోటి కేన్సర్లు ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు / యూటీలలో కేన్సర్‌ పరిస్థితిపై ఇటీవలి భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్‌) నివేదికపై ఏప్రిల్‌ 1న  పార్లమెంట్‌కు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా కేన్సర్‌ ఇదే విధంగా కొనసాగితే.. జనాభాలో మార్పుల కారణంగా 2040 నాటికి కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

మొదటి స్థానాల్లో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్‌ 1న పార్లమెంట్‌లో.. మూడేళ్లలో విస్తరించిన కేన్సర్‌ కేసులపై రాష్ట్రాల వారీగా నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2022లో 14,61,427 కేసులు నమోదైతే, 2023 నాటికి 14,96,972కు పెరిగాయి. 2024 వచ్చేసరికి కేసుల సంఖ్య 15,33,055 గా నమోదైంది. 

కాగా రాష్ట్రాల వారీగా చూస్తే 2022, 2023, 2024లలో మూడేళ్లపాటు వరుసగా 2,10,958, 2,15,931, 2,21,000 కేసులతో.. దేశంలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 1,21,717, 1,24,584, 1,27,512లతో మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్‌లో 1,13,581, 1,16,230, 1,18,910 కేన్సర్‌ కేసులు పెరిగాయి. 4, 5, 6, 7 స్థానాల్లో బిహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి.

కేన్సర్‌ వ్యాప్తికి ఇవే కారణాలు
90–95 శాతం కేన్సర్లు జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా వంటివి నమలడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కేన్సర్‌కు కారకాలుగా చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం కూడా కేన్సర్‌ వ్యాప్తికి ఒక కారణం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ అధికమే..
కేన్సర్‌ కేసుల ఉధృతి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌ 8, తెలంగాణ 11 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 2022లో 73,536 కేసులు ఉండగా, 2023లో 75,086, 2024లో 76,708గా, తెలంగాణలో మూడేళ్లలో 49,983, 51,145, 52,334ల కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్‌ (Breast Cancer) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పొగాకు, మద్యపానం, ఆహారపుటలవాట్లు, వ్యవసాయంలో రసాయనాల వాడకం వంటివి వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

చ‌ద‌వండి: ఔష‌ధ మొక్క‌.. ఆరోగ్యానికి ర‌క్ష‌ 

ఉమ్మడి వరంగల్‌కు వస్తే పురుషుల్లో ఊపిరితిత్తులు, శ్వాసనాళం, తల, గొంతు, బోన్, రక్త (లుకేమియా), ప్రోస్టేట్‌ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా 28, 31, 32 కేసుల చొప్పున వరుసగా మూడేళ్లలో లక్షద్వీప్‌లో, డామన్‌లో 150 నుంచి 173, దాద్రా నగర్‌ హవేలీలో 238ల నుంచి 268లు, లద్దాఖ్‌లో 302 నుంచి 318కు కేన్సర్‌ కేసులను గుర్తించారు.

స్క్రీనింగ్‌ టెస్టులకు ముందుకు రావాలి..
కేన్సర్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. జిల్లాల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఏడాదిలో 600కు పైగా కేన్సర్‌ కేసులున్నాయి. వీరిలో 102కు పైగా  నోటి కేన్సర్‌తో బాధపడుతున్న వారే.. గుట్కా, పొగాకు వల్ల నోటి కేన్సర్, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ వస్తున్నాయి. నలభయ్యేళ్లు దాటిన స్త్రీలు రొమ్ము కేన్సర్‌ రాకుండా ఆరు నెలలకోసారి కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 
– ఎ.అప్పయ్య, డీఎంహెచ్‌వో, హనుమకొండ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement