
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్
అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..
మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
డైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడమే..
పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.
పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!
1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.
గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..
పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.
తేడా వస్తే ఊబకాయమే..!
జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.
‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?
సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.
చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
ఇది ‘సెట్’ అయ్యేదెట్లా?
అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి.