పెరట్లో పోషకాహార గని!

Awareness on Surya Mandalam Garden - Sakshi

సూర్యమండలం 

ఇంటి పరిసరాల్లోనే ఒకటికి పది రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు.. ఉంటే ఇక ఆ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం ఉండనే ఉండదు. గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలోనూ కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకోవటం ఆనవాయితీగా వస్తుండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఎంత మారిపోయాయీ అంటే.. పెరటి తోటలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇతర వృత్తులు చేసుకునే వారితోపాటు వ్యవసాయ కూలీల కుటుంబాలే కాకుండా రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి వచ్చింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం పెచ్చుమీరి పోయింది. పట్టణాల్లో పేద, మధ్యతరగతి వారి పరిస్థితీ ఇంతే. 

పెరటి తోటలు, మేడలపైన ఇంటిపంటల సాగు వైపు దృష్టి సారించడం ద్వారానే ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిటీ బేస్డ్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం (ఏపీసీఎన్‌ఎఫ్‌) పెరటి తోటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీల కుటుంబాల కోసం వారి ఇళ్ల పరిసరాల్లోనే ‘సూర్యమండలం’ నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పండ్లను ఏడాది పొడవునా సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. 

‘సూర్యమండలం’ పంటల నమూనా అంటే?
సౌరవ్యవస్థను పోలినరీతిలో.. అంటే గుండ్రని ఆకారంలో ఎత్తు మడులను తయారుచేసి.. వాటిల్లో వేర్వేరు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లచెట్లు, ఔషధ మొక్కలు సాగు చేసే పద్ధతి ఇది. 

ఎంత స్థలంలోనైనా సూర్య మండలం నమూనాలో పెరటితోటను ఏర్పాటు చేసుకోవచ్చు. విస్తీర్ణం పెరిగే కొద్దీ పంటల వైవిధ్యాన్ని పెంచువచ్చు. పండ్ల మొక్కలను నడి మధ్యలోనే కాకుండా సూర్యమండలం చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండాలంటే కనీసం రెండు సెంట్ల స్థలంలో సూర్య మండలం ఏర్పాటు చేసుకోవటం బాగుంటుంది.

అరసెంటు – సెంటు స్థలంలో సూర్య మండలం నమూనాలో ఎత్తు మడులు ఏర్పాటు చేసుకుంటే.. కుటుంబానికి ప్రతిరోజూ కిలో వరకు కూరగాయలు, ఆకుకూరలు వస్తాయి (అంతస్తుల మాదిరిగా, అన్ని పంటలూ కలిపి)మడులను సిద్ధం చేసుకునేటప్పుడు మట్టిలో ఒక సెంటు స్థలంలో  సుమారు 50 కిలోల చొప్పున ఘన జీవామృతాన్ని కలపాలి. ప్రతి 15 రోజులకొకసారి మడులలో మొక్కలు పూర్తిగా తడిసేటట్లు ద్రవజీవామృతాన్ని పిచికారీ చేయాలి. ఒక వేళ పంటలపై చీడపీడల బెడద ఎక్కవగా ఉంటే అవసరాన్ని బట్టి కషాయాలను పిచికారీ చేసుకోవాలి.

సూర్య మండలంలో (నమూనా చిత్రంలో చూపినట్లు) 15 ఎత్తు మడులు ఉంటాయి. రోజుకు ఒక మడిలో పెరిగే కూరగాయలు, ఆకుకూరలు వాడుకునే విధంగా ఏడు మడులను డిజైన్‌ చేశారు. ఏడు పెద్ద మడులు, ఏడు చిన్న మడులు ఉంటాయి. ప్రతి మడికి మధ్య కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మడిలో కూరగాయ మొక్కలను అంతర పంటల పద్ధతిలో, అంతస్తుల మాదిరిగా వేసుకోవాలి. 

వీలైనన్ని ఎక్కువ రకాల పంటలు వేసుకోవాలి. పంటలను కాలానుగుణంగా మార్పిడి చేసుకోవాలి. అంటే.. ఒక మడిలో వేసిన పంటల కాపు పూర్తయ్యాక అక్కడ మళ్లీ అవే పంటలు వేయకూడదు. అంతర పంటలను ఎన్నుకునేటప్పుడు మిత్రపంటలు పక్క పక్కన ఉన్నట్లయితే మొక్కల ఎదుగుదల బాగుంటుంది.  
సూర్య మండలం మడుల్లో 365 రోజులూ పంటలు ఉండేలా.. కొద్ది వారాల వ్యవధిలో విత్తనాలు/మొక్కలు నాటుకునేలా.. ప్రణాళిక వేసుకోవాలి. కాలానుగుణమైన పంటల సరళి ఎంపిక ముఖ్యం.       

ప్రతిమడిలో పంటల వైవిధ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య సంబంధాలు, సూక్ష్మజీవులతో సహజీవనం అనే ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రాలను ఇక్కడ అనుసరించాలి. 

సూర్య మండలం మధ్యలో వలయాకారంలో ఉన్న మడిలో తక్కువ నీడనిచ్చే పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు (ఉదా: అరటి, బొప్పాయి). 
సూర్యమండలం మధ్యలో నీటి పంపు వచ్చేలా బాగుంటుంది. మధ్యలో నుండి చివరి మడుల వరకు వాలు ఉన్నట్లయితే, నీరు అన్ని చోట్లకు సులువుగా చేరుతుంది. ఎక్కువ అయిన నీరు బయటకు పోయే ఏర్పాటు చేసుకోవాలి.   

ఎత్తు మడులు చేసుకొని, చుట్టూ ఇటుకలతో నిర్మాణం చేసుకొంటే ఎక్కువ కాలం మడులు చెదిరిపోకుండా ఉంటాయి. మడుల మధ్య కాలి బాటలపై పందిరి వేసుకొంటే తీగ జాతి మొక్కలను ఎగ పాకించుకోవచ్చు. 

సూర్యమండలం చుట్టూ కంచే ఉంటే పశువుల నుంచి రక్షణగా ఉంటాయి. అంతే కాకుండా తీగ జాతి మొక్కలను కంచెకు పాకించవచ్చు. 
మడుల అంచులలో దుంప జాతి మొక్కలు, ప్రతి మడిలో ఒక వరుసలో ఒక కాయ కూర పంట, రెండు కాయ కూర మొక్కల మధ్యలో ఆకు కూరలు విత్తుకొని పండించుకోవచ్చు.  

ప్రతీ మడి మధ్యలో ఎర పంటలు (బంతి వంటి పూల మొక్కలు) వేసుకోవటం తప్పని సరి. అవసరాన్ని బట్టి ఔషధ మొక్కలను కూడా చేర్చాలి. కషాయాలు తాగడానికి అవసరమైన మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి.    

సూర్యమండల నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏడాది పొడవునా పెరటి కూరగాయ తోటల సాగుపై ఇతర వివరాలకు.. రైతు సాధికార సంస్థ సైన్స్‌ విభాగం అధికారి డాక్టర్‌ గోవిందుల వెంకట రామన్‌ (94405 22885)ను సంప్ర దించవచ్చు. 

‘సూర్యమండలం’ ప్రయోజనాలు
ఏడాది పొడవునా తాజా కూరగాయల లభ్యత. దూరప్రాంతాల నుంచి ఇంధనం ఖర్చు చేసి కూరగాయల రవాణా చేయాల్సిన అవసరం ఉండదు.
పెరటితోట ఉన్న కుటుంబానికి ఏడాది పొడవునా సమతుల ఆహారం అందుతుంది. 
పౌష్టికాహార లభ్యత వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్య ఖర్చులు తగ్గుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార భద్రత పెరుగుతుంది. 
కుటుంబానికి రోజుకు ఒక కిలో కూరగాయలు, పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. 
సొంతంగా తయారు చేసుకునే ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలతోనే పంటల సాగు చేసుకోవచ్చు. 
రకరకాల దేశవాళీ కూరగాయ వంగడాల పరిరక్షణ సాధ్యమవుతుంది. 
చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు కూరగాయలు, ఔషధాలు కొనే ఖర్చు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యమూ చేకూరుతుంది. 
అయితే, ఇంటి దగ్గర తగినంత చోటు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వారికి ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ కిచెన్‌ గార్డెనింగ్‌ ప్లాట్స్‌ కేటాయించి, సూర్యమండల నమూనాలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు టి. విజయకుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఏడాది ఏపీలో 7 లక్షల గ్రామీణ కుటుంబాల (భూమి లేని 3.5 లక్షల వ్యవసాయ కార్మిక కుటుంబాలు సహా)తో పెరటి తోటల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 
గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద కూడా ఈ నమూనాను ప్రదర్శిస్తుండటం విశేషం. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను, సలహా ఇచ్చే నిపుణులనూ అందుబాటులో ఉంచుతున్నారు. 

గమనించాల్సిన విషయాలు
1 తీగ జాతి పాదులు పాకడానికి పందిళ్లు వేయాలి. సూర్యమండలం చుట్టూ కంచెకు కూడా పాకించవచ్చు.
2 పందిళ్లకు తీగ జాతి మొక్కలను తొలి దశలో జాగ్రత్తగా పాకించాలి. 
కూరగాయ మొక్కల మధ్యలోనూ నేలపై పాకే గలిజేరు వంటి ఆకుకూర మొక్కలను పెంచుకోవచ్చు. సజీవ ఆచ్ఛాదనగా కూడా పనికివస్తాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top