
మహిళలను రక్తహీనత (అనీమియా) సమస్య ఒక పట్టాన వదలదు. అసలు నెలనెలా వచ్చే రుతుస్రావం సమస్యతో రక్తంపోతూ ఉండటం, బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో రక్తంపోవడం, వాళ్లకు వచ్చే యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో మహిళల్లో రక్తంపోవడం చాలా సాధారణం. మన కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే 5వ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫిఫ్త్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే)లోనూ గర్భవతుల్లోని 52 శాతం కంటే ఎక్కువమందిలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు అధికారికంగానే తేలింది. అంటే గర్భవతులందరిలో సగంమంది కంటే ఎక్కువే రక్తహీనతతో బాధపడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మహిళల్లో రక్తహీనత (అనీమియా) సమస్య, దాన్ని అధిగమించడమెలా అనే అంశాలను తెలుసుకుందాం.
సాధారణంగా రక్తహీనత అన్నది స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించేదే అయినా మహిళల్లో మాత్రం చాలా ఎక్కువ. అందునా గర్భవతుల్లో 52 శాతానికి పైగా మహిళల్లో అనీమియా ఉండటం ఎలా ఉన్నా సాధారణ మహిళల్లోని దాదాపు 70 శాతం మందికి పైగా రక్తహీనత ఉంటుందనేది అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లో తేలిన అంశం.
రక్తహీనత (అనీమియా) అంటే...
రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేక΄ోవడాన్ని రక్తహీనత (అనీమియా)గా పరిణిస్తారు. మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తంలోని ఎర్ర రక్తకణాల (ఆర్బీసీ) ద్వారానే పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. వాటి సంఖ్య తగ్గడంతో అన్ని అవయవాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఈ హీమోగ్లోబినే అన్ని కణాలకూ ఆక్సిజన్ అందజేస్తుంటుంది.
మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణమన్నది మగవారిలో 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం.
మహిళల్లో రక్తహీనతకు కారణాణాలివి...
మహిళల్లో ప్రతినెలా వచ్చే రుతుస్రావం కారణంగా ప్రతి నెలా రక్తం పోతుంటుంది. ఇక మరికొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి.
రక్తహీనత లక్షణాలు : రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గి΄ోవడం వల్ల వాళ్లు పాలిపోయిన చర్మం, గోళ్ల కింద రక్తం లేని కారణంగా గోళ్లు తెల్లగా కనిపించడం, ఎర్రగా కనిపించాల్సిన కింది కనుపాప కింద తెల్లగా పాలిపోయినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనిమియా లక్షణాలను తెలుసుకోడానికి భౌతికంగా తొలి పరీక్షగా డాక్టర్లు వీటినే చూస్తారు. ఇవిగాక...
ముఖం పాలిపోయినట్లుగా ఉండటం
కొద్దిపాటి నడకకే ఆయాసం
శ్వాస కష్టంగా తీసుకోవడం ∙తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట
మగతగా ఉండటం
చికాకు / చిరాకు / కోపం
తలనొప్పి
నిద్రపట్టకపోవడం
పాదాలలో నీరు చేరడం
ఆకలి తగ్గడం
కాళ్లుచేతుల్లో తిమ్మిర్లతో అవి చల్లగా మారడం
కొందరిలో ఛాతీనొప్పి
త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు / చికిత్స : మాంసాహారులైతే ఐరన్ పుష్కలంగా లభించే కాలేయం వంటివి తీసుకోవాలి. ఇక శాకాహారులతోటు అందరూ ముదురాకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం. అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి.
సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొందరికి రక్తం ఇవ్వాల్సి రావచ్చు. ఇక టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉన్నందున వాటిని డాక్టర్ల సూచన మేరకు, వారి పర్యవేక్షణలోనే వాడాలి. ఇతరత్రా సమస్యలు కనిపిస్తుంటే డాక్టర్లు వారికి సరిపడే మందుల్ని సూచిస్తారు.
డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్
(చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..)