
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్
బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి.
బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి.
బిల్లు తీసుకోకపోతే నష్టమే..
బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం.
వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది.
కొనుగోలులో అప్రమత్తత అవసరం
స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు
కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది.
ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.
కొనక తప్పడం లేదు
బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే.
– ప్రత్యూష, సంతోష్నగర్, కర్నూలు
ధరలు తగ్గించాలి
బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
– శైలజ, కోడుమూరు
(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?)