భక్తిశ్రద్ధలతో వేడుకలు
ద్వారకాతిరుమల: ఉమాసుతుడు, ఏకదంతుడు, వి ఘ్నాలను తొలగించే వినాయకుడి ఆరాధనకు ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధమవుతోంది. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలిచేందుకు గ్రామగ్రామానా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే వీధివీధినా మండపాలు వెలిశాయి. గణేషుడి ప్రతిమలను సోమవారం ప్రతిష్ఠించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మండపాల అలంకరణలు, విద్యుత్ దీపాలు, పూజా సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
వేలాది మందికి ఉపాధి
గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పురోహితులు, వినాయక విగ్రహాల తయారీ, విక్రయాలు, పూజా సామగ్రి, పూలు, పండ్లు, పత్రి విక్రయాల నుంచి మండపాల అలంకరణలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్స్, టెంట్ హౌస్లు, నిమజ్జనోత్సవ రవాణా వరకు పలు రంగాల వారికి పని లభిస్తుంది. చిన్నస్థాయి వ్యాపారుల నుంచి పెద్ద టెంట్ హౌస్ నిర్వాహకుల వరకూ చవితి సీజన్ ద్వారా ఆదాయం పొందుతున్నారు.
నిర్విఘ్నంగా వేడుకలు
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నిరంతరాయంగా చవితి వేడుకలు జరుగుతున్నా యి. ద్వారకాతిరుమలలోని చెరువు వీధిలో జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో 42 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ గణనాథుడి సేవలో తరించడం ఆనందంగా ఉంటుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. వేడుకలు విషాదం కారాదని తగు జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవాలని కమిటీ నిర్వాహకులు సూచిస్తున్నారు. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, అలంకరణ, స్విచ్ బోర్డులు, జనరేటర్లు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నిమజ్జనం జరిగే చెరువులు, కాలువల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసు నిబంధనలు అందరూ పాటించాలని అంటున్నారు.
పూజలందుకో వినాయక
వాడవాడలా గణేష్ మండపాలు
పూలు, విద్యుద్దీప అలంకరణలు
వేలాది మందికి ఉపాధి మార్గం
జిల్లాలో చవితి సందడి
42 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. మొ దట పెద్దలు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు యువత ముందుకు తీసుకెళ్తోంది. గణపతి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలన్నదే మా ఆకాంక్ష. ఉత్సవాలు ఆనందంగా జరగాలి.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా నిర్వహించడమే మా లక్ష్యం.
– చిలుకూరి నాగ సుబ్రహ్మణ్యం, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు, చెరువు వీధి, ద్వారకాతిరుమల


