పోలవరం రూరల్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ సూచించారు. పోలవరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా అనుమతి పొందాలని, భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దాలు, అశ్లీల నృత్యాలు లేదా రెచ్చగొట్టే నినాదాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని, నిమజ్జన వేడుకల్లో మద్యం సేవించిన వారిని దూరంగా ఉంచాలని కోరారు.
కొయ్యలగూడెం: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన దిప్పకాయలపాడు తూర్పు కాల్వ వంతెనపై మంగళవారం ఉదయం సంభవించింది. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన ఆసుబోయిన వెంకటేశ్ (75) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నారు. బిల్లిమిల్లి సమీపంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులకు హాజరు కావడానికి సైకిల్పై వెళుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


